
- నీళ్లు నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలివ్వలేదు
- మహారాష్ట్ర అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినం
- కాళేశ్వరం కార్పొరేషన్కు గ్యారంటీలిచ్చి.. బడ్జెట్ కేటాయించినం
- ప్రతి విషయానికీ కేబినెట్ ఆమోదం ఉందని స్పష్టీకరణ
- 40 నిమిషాలపాటు 20 ప్రశ్నలు సంధించిన కమిషన్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటి నిల్వ.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ల మార్పు.. అంతా ఇంజినీర్లే చేశారని ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. అవన్నీ టెక్నికల్ అంశాలని, టెక్నోక్రాట్స్ చూసుకుంటారని చెప్పారు. ఇలాంటి టెక్నికల్ విషయాల్లో రాజకీయ నాయకుల నిర్ణయాలు ఉండవని, ప్రభుత్వంతో వాటికి సంబంధం లేదని పేర్కొన్నారు. సోమవారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణకు హరీశ్రావు హాజరయ్యారు.
ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు వెళ్లిన హరీశ్ రావు.. అక్కడ కేటీఆర్, ఇతర నేతలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా కమిషన్ విచారణ జరుపుతున్న బీఆర్కే భవన్కు చేరుకున్నారు. ఉదయం 11.35 గంటలకు విచారణను ప్రారంభించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. దాదాపు 40 నిమిషాల పాటు 20 ప్రశ్నలను సంధించారు.
బ్యారేజీల్లో పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీటిని నింపాలని ఎవరు ఆదేశించారు? ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఏమైనా ఇచ్చారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఇది టెక్నికల్ అంశమని, ప్రభుత్వం నుంచి ఎవరూ ఆదేశాలివ్వలేదని చెప్పారు. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలనేది ఇంజినీర్ల నిర్ణయమని వెల్లడించారు. 2016లోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి అగ్రిమెంట్లు పూర్తయ్యాక.. 2018లో భూసేకరణ ఆపేసి ఫ్లడ్ బ్యాంకులు, డ్రైనేజీ చానెళ్లను నిర్మించాలనుకోవడం తప్పుడు ప్లానింగ్ కాదా? అని కమిషన్ అడిగింది.
దీనికి కూడా ఇంజినీర్లదే బాధ్యత అని, ప్రభుత్వ బాధ్యత కాదు అని హరీశ్ బదులిచ్చారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను మార్చాలని హైపవర్ కమిటీ నిర్ణయించిందా? అని కమిషన్ ప్రశ్నించగా.. అది పూర్తిగా సాంకేతిక అంశమని తెలిపారు. రాజకీయ నాయకులకు దీనిపై అవగాహన ఉండదని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇంజినీర్లు డిసైడ్ చేస్తారని సమాధానమిచ్చారు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను.. కాల్వ దూరం, రెండు బ్యారేజీల మధ్య దూరం, విద్యుత్ ఖర్చును తగ్గించేందుకు వీలుగా మార్చారని చెప్పారు. హైపవర్ కమిటీ, వ్యాప్కోస్ కలిసి బ్యారేజీల లొకేషన్ల మార్పునకు ఆమోదం తెలిపాయని చెప్పారు. వ్యాప్కోస్ నుంచి లెటర్ వచ్చాకే బ్యారేజీల లొకేషన్లను మార్చారని ఆన్సర్ ఇచ్చారు.
టెండర్లు ఖరారయ్యాక మార్పులు చేశారా?
బ్యారేజీల టెండర్లు ఖరారై అగ్రిమెంట్లు పూర్తయ్యాక.. కాంట్రాక్ట్ షరతులను మార్చారా? అని హరీశ్ రావును కమిషన్ ప్రశ్నించింది. సైట్, పనుల పరిస్థితులను బట్టి డిపార్ట్మెంట్.. టెండర్ల షరతులను మార్చేందుకు అవకాశం ఉంటుందని, అనివార్య పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ దానిపై సిఫార్సులు చేసేందుకు వీలుంటుందని హరీశ్రావు చెప్పారు.
జీవో 28 గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నీటి సోర్సులను తెలుసుకునే బాధ్యతను ఎక్స్పర్ట్ కమిటీకి అప్పగించారని హరీశ్ చెప్పారు. మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా నీటిని లిఫ్ట్ చేసుకునేందుకు అవకాశం లేదని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఎన్ని నీళ్లను స్టోర్ చేసుకోవచ్చని కమిషన్ ప్రశ్నించగా.. మూడు బ్యారేజీలు, ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నీ కలిపి 141 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని వెల్లడించారు.
కాళేశ్వరం కార్పొరేషన్పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రుణాల కోసం కార్పొరేషన్ను ఏర్పాటు చేశామని హరీశ్రావు తెలిపారు. కేబినెట్లో తీర్మానం చేశాకే కార్పొరేషన్ను ఏర్పాటు చేశామని, ప్రభుత్వ రంగ సంస్థల నుంచే రుణాలను కార్పొరేషన్ తీసుకున్నదని వెల్లడించారు. కార్పొరేషన్ రుణాలు, వడ్డీల చెల్లింపులకు సంబంధించి కేబినెట్లో చర్చ జరగలేదని హరీశ్ బదులిచ్చారు. కార్పొరేషన్కు ప్రభుత్వం సరిపడా బడ్జెట్ను కేటాయించిందని, రుణాలపై కార్పొరేషన్కు ప్రభుత్వం పూర్తి పూచీకత్తును ఇచ్చిందని వెల్లడించారు.
మహారాష్ట్ర ఒప్పుకోలే..
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేనందునే ప్రాజెక్ట్ సైట్ను మార్చారా? అని కమిషన్ ప్రశ్నించగా.. అవునని హరీశ్ బదులిచ్చారు. ‘‘మేం ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్ట్ సైట్ను మార్చామనే భావనను ప్రజల్లోకి తీసుకె ళ్లారు. కానీ, అందులో వాస్తవం లేదు. డిపార్ట్మెంట్ అధికారులతో ఎన్నో రివ్యూలు చేశాకే ప్రాజెక్ట్ సైట్ను మార్చాం. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించేందుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదు.
2014 జులై 23న నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అప్పటి కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రిఫ్తో సమావేశమయ్యా. బ్యారేజీ నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరా. మునిగే భూములకు ఎంత పరిహారం కావాలన్నా మా సీఎం (కేసీఆర్) ఇస్తామని చెప్పారనీ వివరించాం. కానీ, అందుకు ఆయన అంగీకరించలేదు. 2014 ఆగస్టు 16న కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. అయినా ఫలితం లేదు. ఆ తర్వాత 2014 డిసెంబర్ 23న మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వం (అప్పటికి బీజేపీ అధికారంలోకి వచ్చింది)తో సమావేశమయ్యా.
అప్పటి ఇరిగేషన్ మంత్రి అయిన గిరీశ్ మహాజన్తో నేను ప్రత్యేకంగా భేటీ అయ్యా. ప్రాజెక్టు గురించి వివరిస్తే ఆయన కూడా ఒప్పుకోలేదు. ఇద్దరు సీఎంలు చర్చించుకుంటే బాగుంటుందని చెప్పారు. దీంతో 2015 ఫిబ్రవరి 17న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో మా సీఎం భేటీ అయ్యారు. కానీ, మహారాష్ట్ర సీఎం ఒప్పుకోలేదు. ఎత్తును 148 మీటర్లకు తగ్గించుకోవాలని సూచించారు’’ అని హరీశ్ చెప్పారు.
తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పిందని కమిషన్కు హరీశ్ వివరించారు. అక్కడ 152 మీటర్ల ఎత్తులో 165 టీఎంసీల లభ్యత ఉన్నప్పటికీ.. ఎగువ రాష్ట్రాల వాటా 63 టీఎంసీలుపోనూ మిగిలేది 102 టీఎంసీలేనని సీడబ్ల్యూసీ 2015 ఏప్రిల్ 1న లేఖ రాసిందని వెల్లడించారు. తుమ్మిడిహెట్టి ఎత్తును 148 మీటర్లకు తగ్గిస్తే అక్కడ కేవలం 43 టీఎంసీల నీటి లభ్యతే ఉంటుందని సీడబ్ల్యూసీ 2016 ఫిబ్రవరి 18న చెప్పిందని అన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకే సోర్సును మేడిగడ్డకు మార్చామని వివరించారు. కాగా, హరీశ్ బీఆర్కే భవ న్లో చేరుకోగానే.. భారీగా బీఆర్ఎ స్ శ్రేణులు అక్కడకు తరలివచ్చాయి. పోలీసులు వారిని బయటే బారికేడ్లు పెట్టి ఆపేశారు. విచారణను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన లీగల్ టీంకు కమిషన్ అనుమతివ్వలేదు.
కేబినెట్ ఆమోదంతోనే..
కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి విషయానికీ కేబినెట్ ఆమోదం ఉందని హరీశ్ రావు తెలిపారు. వ్యాప్కోస్ ఇచ్చిన డీపీఆర్లకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. 2016 జనవరి 17న వ్యాప్కోస్ డీపీఆర్ను సమర్పించిందని, ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నా మని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను రీ ఇంజినీరింగ్ చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.
అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులను రీ ఇంజినీరింగ్ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందని వెల్లడించారు. అందులో భాగంగానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రెండు కాంపొనెంట్లుగా రీ ఇంజినీరింగ్ చేసేలా నిర్ణయించామని, తొలి కాంపొనెంట్లో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీతో (ప్రాణహిత -చేవెళ్ల) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లివ్వాలనుకున్నామని తెలిపారు.
‘‘రెండోది కాళేశ్వరం ప్రాజెక్ట్. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మొత్తం ఏడు లింకులున్నాయి. అందులో 6 లింకులను మార్చలేదు.. తొలి లింక్(తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ)లోనే సమస్యలున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రకారం అక్కడ నీటి లభ్యత లేదు. అందుకే ప్రాజెక్ట్ సోర్సును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాం’’ అని హరీశ్రావు సమాధానం చెప్పారు.