జైలుకెళ్లిన టీచర్ కు యధావిధిగా జీతాలు చెల్లించిన ఎంఈఓపై విచారణ

జైలుకెళ్లిన టీచర్ కు యధావిధిగా జీతాలు చెల్లించిన ఎంఈఓపై విచారణ

53 రోజులు రిమాండ్ లో ఉండొచ్చిన టీచర్ గని రసూల్ కు ఠంచనుగా జీతం చెల్లించిన వైనం

జీతం బిల్లు రాయాలంటే రూ.100, ఈఎల్ఎస్ నమోదు చేయాలంటూ రూ.10 వేలు డిమాండ్

వేధింపులు భరించలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన 74మంది టీచర్లు

జూపాడుబంగ్లా ఎమ్మార్సీ భవన్ లో విచారించిన డిప్యూటీ ఈవో అనూరాధ

విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తా: విచారణ అధికారి, డిప్యూటీ ఈవో అనూరాధ

కర్నూలు:  జైలుకెళ్లి 53 రోజులపాటు రిమాండులో ఉండి.. బెయిల్ పై బయటకొచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు కాదు కదా…. జైలులో ఉండి వచ్చిన రోజులకు కూడా జీతాలు ఠంచనుగా చెల్లించిన ఎంఈవో శ్రీనివాసులుపై విచారణ జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూపాడుబంగ్లా ఎమ్మార్సీ భవన్ లో కర్నూలు డిప్యూటీ ఈవో అనురాధ విచారణ చేశారు. ఎంఈవో శ్రీనివాసులుపై ఫిర్యాదు చేసిన 74 మంది టీచర్లకు సమాచారం ఇవ్వగా 29 మంది టీచర్లు విచారణాధికారి ఎదుట హాజరయ్యారు.

విచారణను తీవ్రంగా వ్యతిరేకించి గ్రూపు కట్టేందుకు విఫలయత్నం

టీచర్ల ఫిర్యాదు ఎంఈవోలను ఆగ్రహానికి గురిచేసింది. ఒక దశలో కర్నూలు జిల్లాలోని ఎంఈవోలు అందరూ ఏకతాటిపైకి వచ్చి తప్పుడు ఫిర్యాదులు అంటూ విధులు బాయ్ కాట్ చేస్తామని ఉన్నతాధికారులకు ఆఫ్ ద రికార్డుగా అల్టిమేటం ఇచ్చిన వైనం విద్యాశాఖలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో మాజీ సైనికోద్యోగి, బీటీఎఫ్ అధ్యక్షుడు కె.సతీష్ కుమార్ ఎంఈవో అవినీతి, వేధింపులపై మరిన్ని సాక్షాధారాలను సమాచార హక్కు చట్టం ద్వారా సంపాదించి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు సమర్పించారు. దీంతో ఎట్టకేలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాల్సి వచ్చింది.

ప్రతి పనికీ ఒక రేటు పెట్టి వేధింపులు

ఎంఈవో ఎం.శ్రీనివాసులు జూపాడుబంగ్లా మండలంలో పనిచేసినప్పుడు ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి ముక్కుపిండి వసూలు చేసేవారు. టీచర్లు బడికెళ్లకపోయినా.. యధావిధిగా జీతాలు తీసుకునేలా సహకరించేవాడు. ఎవరైనా ఫిర్యాదు చేసినా  తనకు లంచం ఇచ్చిన వారిపై ఈగ వాలనివ్వలేదు. జూపాడుబంగ్లా మండలం రామసముద్రం పాఠశాలలో పనిచేస్తున్న గని రసూల్ అనే ఉపాధ్యాయుడు చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కుని 2017 అక్టోబర్ 03వ తేదీ నుండి నవంబర్ 25 వరకు 53 రోజులు జైలులో ఉన్నాడు. 48 గంటలకు పైగా జైలులో ఉంటే చాలు  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సస్పెన్షన్ వేటు వేయించాలి. అయితే ఎంఈవో శ్రీనివాసులు ఇవేం పట్టించుకోలేదు. అటెండెన్స్ రికార్డులన్నీ ట్యాంపర్ చేశారు.. బడికెళ్లిన రోజులను వైట్నర్ తో దిద్ది.. జైలుకెళ్లడానికి ముందే  మెడికల్ లీవ్ పై వెళ్లినట్లు రికార్డులు సృష్టించాడు. ఈ తతంగానికి అదే స్కూల్ లో పనిచేసిన ఓ మహిళా టీచర్ కూడా సహకరించినట్లు విచారణాధికారి గుర్తించారు.

వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసిన 74 మంది టీచర్లు

ఎంఈవో శ్రీనివాసులు పనితీరుతో విసిగిపోయిన కొందరు ఉపాధ్యాయులు ధైర్యంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం విద్యాశాఖ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఒక దశలో విచారణ ముందుకు సాగకుండా అనేకమార్గాల్లో ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే మాజీ సైనికోద్యోగి అయిన బీటీఎఫ్ అధ్యక్షుడు కె.సతీష్ కుమార్ ఎప్పటికప్పుడు సమాచార హక్కు చట్టం ద్వారా మరిన్ని ఆధారాలు సంపాదించి తిరుగులేని రుజువులతో మళ్లీ ఫిర్యాదు చేశారు. నంద్యాల సబ్ జైలు అధికారులు దృవీకరించిన ఉత్తర్వుల ప్రతులను కూడా అందజేశారు. వీటన్నింటినీ మరోసారి ధృవీకరించుకున్నారు విచారణాధికారిణి.  ఫిర్యాదులన్నీ తామే చేశామని.. అంగీకరిస్తూ టీచర్ల నుండి లిఖితపూర్వకంగా లేఖలు తీసుకున్నానని.. వారిచ్చిన ఆధారాలతో పూర్తి స్థాయి విచారణ నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తానని డిప్యూటీ ఈవో అనూరాధ తెలిపారు.

53 రోజులు రిమాండ్ లో ఉన్నట్లు సబ్ జైలు అధికారి ఇచ్చిన ధృవీకరణ పత్రం ఇదే..

for more News…

ఎడ్యుకేషన్ స్టార్టప్‌‌‌‌లకు దండిగా ఫండ్స్​

వీడియో: మా వాడకట్టకు రోడ్డు వేయించండి.. ఎమ్మెల్యేను అడిగిన బాలుడు

మీరు నీళ్లు ఎలా తాగుతున్నారు.. అలా తాగితే మాత్రం డేంజరే..