
కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ లో భారీగా ఏర్పాట్లు చేశారు. పరిసరాల్లో భారీ కటౌట్లు ఏర్పాటయ్యాయి. ఉదయం నుంచే నేతలు బొకేలు పట్టుకొని బీఆర్ఎస్ ఆఫీసు వద్ద క్యూ కట్టారు. ఈ తరుణంలో ఆఫీసుకు వచ్చిన కేటీఆర్ కేక్ కట్ చేసి ఎవరినీ కలవకుండానే వెళ్లిపోవడంతో పలువురు నేతలు నారాజ్ అయ్యారు. ఆ లిస్టులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉండటం గమనార్హం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి దయాకర్ రావు కేటీఆర్ జన్మదినం సందర్భంగా హెల్మెట్లు పంచాలనుకున్నారు. ఇందుకోసం గులాబీ రంగుతో కూడిన హెల్మెట్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. వాటికి ముందు వైపు కేటీఆర్, వెనుక వైపు కేసీఆర్ స్టిక్కర్లు అతికించారు. పార్టీ కార్యకర్తలకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఇవ్వాలని భావించిన ఆయన ఏకంగా మూడు వేల హెల్మెట్లను తెలంగాణ భవన్ కు ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు.
►ALSO READ | కృష్ణా జలాలపై ఏపీ ఇష్టారాజ్యం..కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
అయితే తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్ నేరుగా లోనికి వెళ్లి.. కేక్ కట్ చేశారు. ఆ తర్వాత ప్రత్యేకంగా నాయకులను, అభిమానులను కలువలేదు. ఎర్రబెల్లి తెచ్చిన హెల్మెట్ల వంక కూడా చూడకుండా వెళ్లిపోవడంతో దయాకర్ రావు నారాజ్ అయ్యారు.