
వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు 1956 ఆగస్ట్ 15న జన్మించారు. తల్లిదండ్రులు జగన్నాథరావు, ఆదిలక్ష్మి . ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. డిగ్రీ మధ్యలోనే వదిలోసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎర్రబెల్లికి భార్య ఉషారాణి , ఒక కుమారుడు, ఒక కుమార్తె.
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుది….47 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో 1982లో టీడీపీలో చేరారు. 1999లో తెలుగుదేశం పార్టీ విప్గా పనిచేశారు. మూడుసార్లు ఉమ్మడి వరంగల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా.. 2005, 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు ఎర్రబెల్లి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనర్ గా, శాసన సభాపక్ష నేతగా సేవలందించారు. 1987లో వరంగల్ డీసీసీబీ అధ్యక్షునిగా పనిచేశారు.
1983లో మొదటిసారిగా వర్థన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1994లో వర్థన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు . 1999 , 2004లో వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఎర్రబెల్లి. 2009లో పాలకుర్తి నియోజకవర్గానికి మారారు ఎర్రబెల్లి . అక్కడి నుంచి 2009, 2014లో విజయం సాధించారు . 2016లో టీఆర్ఎస్ లో చేరారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించిన ఎర్రబెల్లి రెండోసారి హ్యాట్రిక్ సాధించారు.
సామాజిక సేవల్లోనూ ముందున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. 2008లో ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి పేదల సామాజిక ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 65 మినరల్ వాటర్ ప్లాంట్లను గ్రామాల్లో ఏర్పాటు చేశారు. తండ్రి పేరిట ఎర్రబెల్లి జగన్నాథరావు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి.. వర్థన్నపేట నియోజకర్గంలోని నాలుగు మండలాల్లో 61 వేల మందికి హెల్త్ క్యాంపుల ద్వారా సేవలందించారు ఎర్రబెల్లి.