- తల్లి మృతి, ప్రాణాలతో బయటపడ్డ కూతురు
మియాపూర్, వెలుగు: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు నెలల పాపతో కలిసి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తాను ఉంటున్న అపార్ట్మెంట్ 6వ ఫ్లోర్ నుంచి కిందకు దూకింది. తీవ్రగాయాలతో అమె అక్కడికక్కడే చనిపోగా, గోడపై ఉన్న ఫెన్సింగ్కు డ్రెస్ చిక్కుకొని పాప గాయాలతో బయటపడింది. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన భూపేంద్ర సాహుకు మధ్యప్రదేశ్ రాష్ట్రం బుద్గావ్కు చెందిన ఈషా సాహు(37)తో 2015లో పెండ్లి జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేస్తూ ఎనిమిదేండ్లుగా వారు మియాపూర్ మయూరినగర్లోని లక్ష్మీ ప్రెస్టేజ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఈషా సాహు మెటర్నటీ సెలవులో ఉంది.
శుక్రవారం మధ్యాహ్నం భర్త, పెద్ద కూతురు విధిని సరుకులు తీసుకురావాలని బయటకు పంపించింది. సాయంత్రం ఆరు నెలల కూతురు వాణితో కలిసి ఆరవ ఫ్లోర్కు వెళ్లి పాపతో కలిసి కిందకు దూకింది. ఈషా సాహు ఘటనా స్థలంలో చనిపోగా, అపార్ట్మెంట్ కాపౌండ్ వాల్ ఫెన్సింగ్కు వాణి డ్రెస్ చిక్కుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఈషా సాహు రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు ఆరు నెలలుగా డిప్రెషన్లో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
