గోదావరిఖని, వెలుగు: రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో నమోదైన 53 కేసులకు సంబంధించిన రూ.కోటి విలువైన 200.465 కిలోల గంజాయిని శుక్రవారం దహనం చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కోర్టు అనుమతితో గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలోని వెంకటరమణ ఇన్సినిరేటర్స్లో గంజాయిని దహనం చేశారు. పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, జైపూర్ ఏసీపీ ఎ.వెంకటేశ్వర్లు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బాబురావు, అనిల్ పాల్గొన్నారు.
