- మంత్రులు తుమ్మల, ఉత్తమ్పై ఎర్రబెల్లి దయాకర్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతులకు ఏం చేశారని రైతు మేళాలు నిర్వహిస్తున్నారో చెప్పాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్కుమార్రెడ్డిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బస్సుల్లో తీసుకొచ్చి మేళా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మంత్రులు తుమ్మల, ఉత్తమ్ ఒక్క గింజ ధాన్యమైనా కొన్నారా అని ప్రశ్నించారు. బోనస్ అయినా ఇచ్చారా అని మండిపడ్డారు.
గురువారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడితే కేటీఆర్పై కేసులు పెట్టడమేంటని ఎర్రబెల్లి ప్రశ్నించారు. కేసీఆర్పై రేవంత్ అడ్డగోలుగా మాట్లాడారని..మరి రేవంత్పై ఎన్ని కేసులు పెట్టాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులు కల్లాల్లో తిరిగి రైతుల పంటను కొనుగోలు చేశారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ధాన్యం కొనే పరిస్థితి లేదన్నారు.
రైతులు ఇండ్లలో పడుకునే పరిస్థితి లేకుండా పోయిందని, ధాన్యం కుప్పల మీద పడుకుంటున్నారని పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్ అమలవుతుందా లేదా రాహుల్ గాంధీ చెప్పాలని సవాల్ విసిరారు. రైతుల బాధలు తెలియని వ్యక్తి నాయిని రాజేందర్రెడ్డి అని సత్యవతి రాథోడ్ అన్నారు. రేవంత్ రెడ్డి అన్న మాటలు గుర్తు చేశామని, తామేం ఎక్కువగా మాట్లాడలేదని చెప్పారు. కేటీఆర్ వరంగల్ సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర చేసిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
