కేసీఆర్, హరీష్ పోటీకి రావాలి

కేసీఆర్, హరీష్  పోటీకి రావాలి

తన రాజీనామా వల్లే సీఎం కేసీఆర్ కు అన్ని వర్గాల ప్రజలు గుర్తొస్తున్నారని చెప్పారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. వాళ్లను వీళ్లను కాదు... మీరే పోటీకి రావాలని కేసీఆర్, హరీశ్ కు సవాల్ చేశారు ఈటల. కరీంనగర్ జిల్లా  వీణవంక మండలం ఘన్ముఖ్ల గ్రామంలో గౌడ సంఘానికి చెందిన పలువురు ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల.. డబ్బు, అధికారం విషయంలో నేను వాళ్లతో పోటీ పడకపోవచ్చు కానీ.. ప్రజాభిమానం నాపై ఉందన్నారు. హుజురాబాద్ లో జరిగేది కురుక్షేత్ర యుద్దమని..కౌరవులకు, పాండవులకు మధ్య జరుగుతున్న యుద్ధమిది అన్నారు. మేము పాండవుల పక్షాన ఉన్నోళ్లమని.. ఈటల రాజేందర్ ఏం చేశాడని.. అతనిపై ఇంతలా మాట్లాడుతున్నారని.. ప్రజలే నిలదీస్తున్నారన్నారు. 

టీఆర్ఎస్ వాళ్లు  గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్లు, పంటపొలాలపై మిడతల దండు పడ్డట్లు ఊర్లల్లో తిరుగుతున్నారని.. మీకోసం గొంతెత్తి మాట్లాడితే నా గొంతు నొక్కుతారా అన్నారు. ఇప్పటికే 200 కోట్లు ఖర్చుపెట్టారని తెలిపారు. అయితే ఈటల ఈ మాటలు చెబుతుండగా ఇంకో రూ. 200 కోట్లు ఖర్చు పెట్టినా వాళ్లు రారని..  నీకే ఓటువేస్తామని ఓ మహిళ చెప్పింది. మేమైతే వెనక్కి తిరగమని హామీ ఇచ్చింది మహిళ.  కార్యక్రమానికి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ రావు , ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.