బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ నిర్ణయమే: ఈటల రాజేందర్

బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ నిర్ణయమే: ఈటల రాజేందర్
  • అందుకు కేబినెట్‌‌‌‌‌‌‌‌ కూడా ఆమోదం తెలిపింది
  • కాళేశ్వరం కమిషన్‌‌‌‌‌‌‌‌ ముందు ఈటల రాజేందర్ వెల్లడి
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని టెక్నికల్ టీమ్స్, ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ కమిటీ సిఫార్సులు 
  • ఆ నివేదికల ఆధారంగానే కేబినెట్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌ కమిటీలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడి 
  • వ్యాప్కోస్‌‌‌‌‌‌‌‌కు రూ.5.94 కోట్ల చెల్లింపుల విషయంతనకు తెలియదని జవాబు 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించాలన్నది అప్పటి సీఎం కేసీఆర్​నిర్ణయమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్​ తెలిపారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్​రీడిజైన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ మార్పుపై టెక్నికల్​ టీమ్స్​ స్టడీ చేసి రిపోర్ట్​ఇచ్చాయి. ఆ రిపోర్ట్​ఆధారంగా ప్రాజెక్ట్​ లొకేషన్లను నాటి సీఎం కేసీఆర్ మార్చారు.

 అనంతరం అప్పటి ఇరిగేషన్​శాఖ మంత్రి హరీశ్ రావు చైర్మన్‌‌‌‌‌‌‌‌గా.. నేను, తుమ్మల నాగేశ్వర రావు సభ్యులుగా కేబినెట్​సబ్​కమిటీ  వేశారు. టెక్నికల్​టీమ్స్, ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్​ కమిటీ నివేదికల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించాం. దీనికి కేబినెట్​కూడా ఆమోదం తెలిపింది’’ అని చెప్పారు. శుక్రవారం కాళేశ్వరం జ్యుడీషియల్​కమిషన్​విచారణకు ఈటల హాజరయ్యారు. 

అప్పట్లో ఆర్థికమంత్రిగా ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై కమిషన్​ చైర్మన్​ జస్టిస్ ​పీసీ ఘోష్​ ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎవరి నిర్ణయం మేరకు నిర్మించారని జస్టిస్​ ఘోష్​ప్రశ్నించగా, ఈటల సమాధానమిస్తూ.. ‘‘గతంలో డాక్టర్ బీఆర్ ​అంబేద్కర్ ​ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో ప్రతిపాదించారు. కానీ అక్కడ నీటి లభ్యత లేదని సెంట్రల్​ వాటర్​ కమిషన్ ​అభ్యంతరం తెలిపింది. 

దాంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో ముంపు ఉంటుందని చెప్పి 152 మీటర్లకు ఒప్పుకోలేదు. కేవలం 148 మీటర్లకే ఒప్పుకున్నది. తుమ్మిడిహెట్టితో 30 టీఎంసీలు నగరాల తాగునీటి అవసరాలు, 10 టీఎంసీలు గ్రామీణ తాగునీటి అవసరాలు, 15 టీఎంసీలు పరిశ్రమలకు ఇవ్వడంతో పాటు 16.5 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని భావించారు. 

అయితే 148 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మిస్తే సరిపోను నీటి లభ్యత ఉండదని భావించి ప్రాజెక్ట్​సైట్‌‌‌‌‌‌‌‌ను మేడిగడ్డకు మార్చారు. తొలుత రూ.63 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిపాదించగా, ఆ తర్వాత దాని వ్యయం రూ.85 వేల కోట్లకు పెరిగింది. అనంతరం ఎంతకు పెరిగిందో నాకు తెలియదు” అని తెలిపారు.  

మీరు సంతకాలు చేశారా? 

కాళేశ్వరం బ్యారేజీలను నిర్మించాలని 2016 మార్చి 15న కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై ఆ​కమిటీ సభ్యులుగా మీరు సంతకాలు చేశారా? అని జస్టిస్​ఘోష్​ ప్రశ్నించగా.. సంతకాలు చేశానని ఈటల రాజేందర్​సమాధానమిచ్చారు. బ్యారేజీలను నిర్మించాలని ఎవరు నిర్ణయించారని జస్టిస్​ఘోష్​మరోసారి ప్రశ్నించగా.. ‘‘టెక్నికల్​ కమిటీ ఇచ్చిన రిపోర్టును కేబినెట్​మీటింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. 

సీఎం నేతృత్వంలోని పూర్తి కేబినెట్​దానికి ఆమోదం తెలిపింది” అని జవాబు చెప్పారు. ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్​ కమిటీ కూడా ఈ బ్యారేజీలను నిర్మించాలని సిఫార్సు చేసిందా? అని ప్రశ్నించగా.. ‘‘గోదావరి నదిపై చాలా ప్రాంతాలను ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్​కమిటీ స్టడీ చేసింది. చివరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సూచించింది” అని తెలిపారు.

 బ్యారేజీలను నిర్మించే ప్రాంతాలపై స్టడీ, డీపీఆర్​(డిటెయిల్డ్​ప్రాజెక్ట్​రిపోర్టు) ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌ను వ్యాప్కోస్​సంస్థకు అప్పగిస్తూ రూ.5.94 కోట్ల నిధులను శాంక్షన్​చేస్తూ 2015 ఏప్రిల్​ 3న ప్రభుత్వం ఆదేశాలిచ్చిందా? అని కమిషన్​ ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదని ఈటల సమాధానమిచ్చారు.  

కాళేశ్వరం కార్పొరేషన్ ​పర్పస్ ​ఏంటి? 

కాళేశ్వరం కార్పొరేషన్ పర్పస్​ఏంటని ఈటలను కమిషన్​ ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ.. ‘‘అప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. దీంతో నిధులకు కొరత ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం కాళేశ్వరం కార్పొరేషన్​ఏర్పాటు చేశారు. అది స్వతంత్ర సంస్థ. ఇంజనీర్​హరిరామ్​ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా దాన్ని ఏర్పాటు చేశారు. ఆయన గ్యారంటీ కిందనే కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు రుణాలు తీసుకున్నారు’’ అని తెలిపారు. 

బ్యారేజీలకు వచ్చే ఆదాయం ద్వారానే రుణాలను చెల్లిస్తామంటూ విజయ బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు కదా? అని కమిషన్​ ప్రశ్నించగా.. వివిధ వర్గాలకు నీటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో రుణాల చెల్లింపులు చేస్తామని చెప్పారన్నారు. ప్రాజెక్ట్​నిర్మాణం కోసం బడ్జెట్‌‌‌‌‌‌‌‌కు సంబంధం లేకుండా లోన్లు తీసుకున్నారా? అని కమిషన్​ ప్రశ్నించగా.. అది పూర్తిగా కార్పొరేషన్​నియంత్రణలోనే ఉంటుందని ఈటల చెప్పారు. దానికి ఆర్థిక శాఖతో ఎలాంటి సంబంధం లేదని బదులిచ్చారు. 

బ్యారేజీలు ఎక్కడ కట్టాలన్నది నేతలకు తెల్వదు.. 

బ్యారేజీలు నిర్మించిన స్థలం సరైంది కాదు కదా? అని ఈటలను కమిషన్​ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఏ బ్యారేజీ ఎక్కడ కట్టాలన్నది టెక్నికల్​కమిటీ చూసుకుంటుందని, దీనికి ఆర్థిక శాఖకు సంబంధం లేదని చెప్పారు. దీనిపై రాజకీయ నాయకులకు ఏం తెలియదని, సమాధానం చెప్పలేనని పేర్కొన్నారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక క్రమశిక్షణను పాటించారా? అని కమిషన్​ ప్రశ్నించగా.. ఇరిగేషన్​శాఖకు ప్రత్యేకంగా అకౌంట్స్​డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్​ఉంటుందని చెప్పారు. వారి వద్ద అన్ని రికార్డులుంటాయని తెలిపారు. ఎంత ఖర్చు చేయాలి.. దేనికి ఎన్ని నిధులు ఇవ్వాలన్నది వారికే తెలుస్తుందన్నారు. ఆర్థిక శాఖ కేవలం బడ్జెట్‌‌‌‌‌‌‌‌నే చూసుకుంటుందని పేర్కొన్నారు.

కాళేశ్వరం సృష్టికర్తనని కేసీఆర్ చెప్పుకున్నరు: ఈటల

కాళేశ్వరం సృష్టికర్తను తానేనని కేసీఆర్​వందలసార్లు చెప్పుకున్నారని ఈటల రాజేందర్ అన్నారు. ప్రాజెక్టుపై కేసీఆరే నిర్ణయం తీసుకున్నారని, కేబినెట్‌‌‌‌‌‌‌‌తో ఆమోదింపజేశారని తెలిపారు. ఫైనాన్స్​డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ఏం సంబంధం లేదని పేర్కొన్నారు. విచారణ అనంతరం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే భవన్​వద్ద మీడియాతో ఈటల మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్​ రిపోర్టును త్వరగా బయటపెట్టాలని ఆయన డిమాండ్​చేశారు. 

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వారిని శిక్షించకుంటే సీఎంకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయ పబ్బం గడపవద్దని అన్నారు. డిజైన్స్, కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌తో సంబంధం ఉందా? అని కమిషన్​చైర్మన్​అడిగారని తెలిపారు. తమ బతుకులు పారదర్శకంగా ఉన్నాయని, కణత మీద తుపాకీ పెట్టినా విలువలు పోగొట్టుకోమని చెప్పారు. ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలే నిజమైన న్యాయ నిర్ణేతలన్నారు.