
- బ్యారేజీ కుంగిన సమయంలో.. కాళేశ్వరం కేసీఆర్ మదిలో పుట్టిందని వ్యాఖ్య
- హెలికాప్టర్లలో వెళ్లి బ్యారేజీ సైట్లను కేసీఆరే ఎంపిక చేశారని కామెంట్తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని నాడు చెప్పిన ఈటల
- తాజాగా కమిషన్ ముందు కేబినెట్ మొత్తం నిర్ణయం తీసుకుందని వెల్లడి
- ఎక్స్పర్ట్స్ కమిటీనే బ్యారేజీ సైట్లను ఎంపిక చేసిందని బుకాయింపు
- తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీలు లేవని సీడబ్ల్యూసీ అభ్యంతరం చెప్పిందంటూ అబద్ధాలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట మార్చారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత 2 రోజులకు అంటే 2023 అక్టోబర్ 23న బీజేపీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్మీట్లోను, ఆ తర్వాత జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్లోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కేసీఆర్ ఆలోచనల నుంచే పుట్టిందని ఆయన చెప్పారు. తాజాగా.. కమిషన్ ముందు మాత్రం టెక్నికల్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టుల ప్రకారమే ప్రాజెక్ట్ రీడిజైన్ చేశారని వెల్లడించారు.
కాళేశ్వరం కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ అని, హెలికాప్టర్లో వెళ్లి సైట్లను సెలెక్ట్ చేశారని నాడు చెప్పిన ఈటల.. ఇప్పుడు మాత్రం అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారని స్టేట్మెంట్ఇచ్చారు. ఆనాడు కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు మాత్రం కేబినెట్ ఆమోదం తెలిపాకే ప్రాజెక్ట్ను నిర్మించారంటూ చెప్పుకొచ్చారు. సీడబ్ల్యూసీ ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని నాడు చెప్పి.. ఇప్పుడేమో సీడబ్ల్యూసీ అభ్యంతరం తెలిపిందన్నారు. ఈటల అప్పుడు చెప్పినదానికి.. ఇప్పుడు చెప్పినదానికి అసలు పొంతనే లేదని, మాట మార్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ను కాపాడేందుకే ఇలా చెప్పారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నాడు ఏమన్నారంటే..
కాళేశ్వరం ప్రాజెక్టు ఆహా ఓహో అంటూ నాటి సీఎం కేసీఆర్ గొప్పులు చెప్పుకున్నారని 2023 అక్టోబర్ 23న నిర్వహించిన ప్రెస్మీట్లో ఈటల వెల్లడించారు. ‘‘కేసీఆర్ తన మదిలో నుంచి పుట్టిన బ్రెయిన్చైల్డ్గా ఈ ప్రాజెక్టును చెప్పుకున్నారు. 16 టీఎంసీల కెపాసిటీతో మేడిగడ్డ బ్యారేజీని నిర్మించేటప్పుడు సరైన పద్ధతిలో కట్టకుంటే నష్టం తప్పదని ఆనాడే నిపుణులు హెచ్చరించారు. దేశంలోని ఇంజనీర్ల కన్నా పెద్ద ఇంజనీర్లాగా కేసీఆర్ ఆ ప్రాజెక్టుకు డిజైన్ చేశానని చెప్పుకున్నారు.
వాళ్ల అనుభవం కన్నా తన అనుభవం గొప్పదన్నట్టు మాట్లాడారు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే.. వందల వేల గంటలు నా మెదడును కరిగించి తెలంగాణ సమాజానికి నీటి కొరతను తీర్చానన్నారు. అపరభగీరథుడిలాగా అవతారం ఎత్తాననే రీతిలో ప్రచారం చేసుకున్నారు. ఉమ్మడి ఏపీలో జలయజ్ఞంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నుంచి 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటే.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. ఒక్కటే లిఫ్ట్తో ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోసేలా ప్లాన్ చేశారు. అక్కడి నుంచి పాత సిస్టమ్తోనే నీటిని తరలించాల్సి ఉండేది. కానీ, కేసీఆర్ ఆనాటి ప్రభుత్వాలు, ఆ సీఎంలు ఎంత? వాళ్ల లెక్కంత? నా పేరు ఉండాలె అన్న సంకుచిత భావనతో కాళేశ్వరం రీడిజైన్ ప్రాజెక్ట్ను చేపట్టారు. ఎవరి ఆనవాళ్లూ ఉండకూడదన్న ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు టెండర్లు ఆహ్వానించారు. వాటికీ అలకేషన్పద్ధతిలోనే కాంట్రాక్ట్ సంస్థలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఇదివరకు ప్రాజెక్టులు కట్టిన అనుభవం ఉన్న సంస్థలు టెండర్లలో పాల్గొనలేదు. ఒక శాతం వేరియేషన్తోనే టెండర్లు ఆహ్వానించారు. గిన్నిస్ రికార్డుల కోసం అతి తక్కువ కాలంలో బ్యారేజీలను నిర్మించిన ఏకైక వ్యక్తి కేసీఆర్. బ్యారేజీల సైట్లను నిష్ణాతులైన నిపుణులు లేదంటే కేంద్ర సంస్థలతో ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ, కేసీఆరే హెలికాప్టర్లో వెళ్లి ఒక చోట 1.7 కిలోమీటర్లు ఉందని, ఇంకో చోట 1.2 కిలోమీటర్లు ఉందని చెప్పి.. సెలెక్ట్ చేశారు. కనీసం సాయిల్ టెస్టులకూ టైం ఇవ్వలేదు. ఆ మెషీన్లు కేవలం 5 మీటర్లకు మాత్రమే శాంపిళ్లను తీస్తుంది.
దానికి ఏడాది టైం పడుతుంది. కానీ, ఆ టైం కూడా ఇవ్వలేదు. సాయిల్ టెస్టులను సరిగ్గా చేశారా? లేదా? అన్నది కూడా తెలియదు. వాటి రిపోర్టులున్నాయో లేదో ఇవాళ్టికీ స్పష్టత లేదు. మేడిగడ్డ కట్టినప్పటి నుంచే లీక్ అవుతున్నది. ఇసుక మీదనే ఫౌండేషన్ వేశారు. హార్డ్ సాయిల్ వచ్చే వరకు ఫౌండేషన్ వేసి పిల్లర్లను నిర్మించాలని నిష్ణాతులు చెబుతున్నారు. కాళేశ్వరం బ్యారేజీలు ఫెయిల్ అయినందుకు పూర్తి బాధ్యత కేసీఆర్దే. ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. మామూలుగా బ్యారేజీల్లో 4 టీఎంసీలకు మించి స్టోర్ చేయరు.. కానీ, ఆయన గొప్పగా ఉండాలనుకుని 16 టీఎంసీలతో కట్టిండు” అంటూ ఆనాడు ఈటల ఆరోపణలు చేశారు.
ఇప్పుడేమన్నరంటే?
తాజాగా కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వచ్చిన ఈటల.. అసలు తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవన్నట్టుగా చెప్పుకొచ్చారు. సీడబ్ల్యూసీ అభ్యంతరం తెలిపిందన్నారు. అంతేకాదు.. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ పరిశీలించాకే బ్యారేజీలపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. హెలికాప్టర్లలో తిరిగి బ్యారేజీ సైట్లను కేసీఆరే సెలెక్ట్ చేశారని నాడు చెబితే.. ఇప్పుడేమో ఎక్స్పర్ట్స్ కమిటీ ఆ మూడు బ్యారేజీల స్థలాలను ఎంపిక చేసిందని బుకాయించారు. కేబినెట్లో పెట్టి చర్చించాకే నిర్ణయం తీసుకున్నారంటూ నాటి కేబినెట్ మీదికి నెట్టేశారు.
అసలు తమ సొంత బీజేపీ నేత చెప్పిన మాటలకు.. ఇప్పుడు ఈటల చెబుతున్న మాటలకు పొంతనే లేకుండా పోయింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన వెదిరె శ్రీరామ్.. తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల లభ్యత ఉందని నాటి సీడబ్ల్యూసీ లేఖలనూ కమిషన్కు అందజేశారు. కానీ, ఆ పార్టీకే చెందిన ఈటల రాజేందర్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ కమిషన్కు చెప్పారు. బ్యారేజీల నిర్మాణానికి అడ్డగోలుగా టెండర్లు ఇచ్చారని అప్పుడు చెప్పిన ఆయన.. ఆర్థిక క్రమశిక్షణ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంటుందంటూ ఇప్పుడు కమిషన్ ముందు చెప్పడం గమనార్హం.