ప్రేమతో కాదు..  నన్ను ఓడించాలనే  కోపంతో చేస్తున్రు 

ప్రేమతో కాదు..  నన్ను ఓడించాలనే  కోపంతో చేస్తున్రు 
  •  నియోజకవర్గంలో పనులపై బీజేపీ నేత ఈటల

హుజూరాబాద్ టౌన్, వెలుగు: హుజూరాబాద్​లో అభివృద్ధి పనులు, పథకాల అమలు.. అన్నీ ప్రేమతో కాదు.. తనను ఓడించాలనే కోపంతో చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. హుజూరాబాద్ మండలం రాంపూర్​లో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరిన యువకులకు కండువా కప్పారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. ‘చదువుకున్న యువకులు ఆగమవుతున్నారు. వారికి నౌకర్లు రావడం లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు.  నేను ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటే నాపై కుట్రలు చేసే పనిలో అధికార పార్టీ వాళ్లు ఉన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 18 ఏండ్లుగా కష్టపడి పని చేసిన నన్ను కుడి భుజం అన్నారు, తమ్ముడు అన్నారు. ఇంతకాలం లేనిది ఒక్కసారిగా ఇప్పుడు దెయ్యం అంటున్నారు. ఇంత కాలం పెన్షన్లు ఇవ్వకుండా కేసీఆర్ తాళం వేసుకున్నడు.. ఇయ్యాల డప్పు చాటింపు చేసి హుజూరాబాద్ నియోజక వర్గంలో శాంక్షన్​ చేస్తున్నారు. అడగకుండానే అభివృద్ధి పనులు చేస్తున్నారు. అన్ని ఇస్తున్నారు.. ఇవన్నీ ప్రేమతో చేస్తున్నవి కావు. ఈ ఈటలపై కోపంతో చేస్తున్నారు. నేను ధర్మాన్నే నమ్ముకున్నా.. నాకు ప్రజలే ధైర్యం నూరి పోస్తున్నారు. నీ వల్లనే పనులు అవుతున్నాయని ప్రజలే నాకు చెబుతున్నారు..’ అని వెల్లడించారు.