ఇరాన్-అమెరికా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ కష్టాలు ఎక్కువయ్యాయి. గ్యాస్ షార్టేజీతో సమాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురు సరఫరా ఆగిపోవడం ఇండియాకు ఇబ్బంది కలిగించే అంశం. ఒకసారి రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటూ.. మరోసారి కొనవచ్చునంటూ అమెరికా పెట్టే షరతులు సంకట స్థితిలోకి నెట్టేస్తున్నాయి.
లేటెస్టుగా ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోళ్లు చేయవచ్చునని అమెరికా అనుమతించడం ఇండియాకు ఓ మేరకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇరాన్ ఆయిల్ కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో.. ఇండియన్ రిఫైనరీలు ఇరాన్ క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లకు సిద్ధమవుతున్నాయి. హార్మాజ్ జలసంధిలో నౌకలు నిలిచిపోయిన పరిస్థితుల్లో ఇది కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.
అయితే ఇదే సమయంలో ఇరాన్ మైండ్ గేమ్ ఆడుతుండటం ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీయ ట్రేడర్స్ కొనుగోలు చేసేందుకు తమ వద్ద మిగులు చమురు లేదని ఇరాన్ ప్రకటించింది.
శుక్రవారం (మార్చి 20) యూఎస్ ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సంట్ మాట్లాడుతూ.. ఇరాన్ ఆయిల్ కొనేందుకు వివిధ దేశాలకు తాత్కాలికంగా 30 రోజులు అనుమతిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన క్రూడ్ ధరల తగ్గించి స్థిరత్వానికి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. యుద్ధం కారణంగా గత వారం నుంచి క్రూడ్ బ్యారెల్ ధర వంద డాలర్లను మించిపోయింది. దీనికి ముఖ్యం కారణం.. హర్మూజ్ జలసంధి దగ్గర నుంచి చమురు నౌకలను ఇరాన్ అనుమతించకపోవడమే. ప్రపంచంలోనే 20 శాతం ఆయిల్, గ్యాస్ ఈ జలసంధి నుంచే వెళ్తుంది. అక్కడ ఉన్ ఆంక్షల కారణంగా సరఫరా పూర్తిగా దెబ్బతినటంతో ప్రపంచ దేశాలు గ్యాస్, ఆయిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ప్రస్తుతానికి అయితే యూఎస్ అనుమతించింది కానీ.. మళ్లీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. అనేదే ప్రశ్నార్థకంగా మారింది.
అంతకు ముందు రష్యా ఆయిల్ కొనవచ్చునని అమెరికా పర్మిషన్ ఇవ్వడంతో ప్రస్తుతానికి రష్యా నుంచి చమురు కొనుగోలుకు సంబంధించి ఆయిల్ బుక్ చేసుకున్నాయి ఇండియన్ రిఫైనరీలు. అదే క్రమంలో ఇతర ఆసియా దేశాలు ఇరాన్ ఆయిల్ కొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టగా.. యూఎస్ అనుమతితో చమురు దిగుమతి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
