రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రముఖ భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ మెహదీపట్నం ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాడు. ప్రార్థనల అనంతరం సిరాజ్ తన స్నేహితులు, స్థానికులతో కలిసి పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. అభిమానులు ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా సిరాజ్ అందరితో సరదాగా మాట్లాడి, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. రంజాన్ పండుగను శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
రంజాన్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో సందడి వాతావరణం నెలకొంది. మక్కా మసీదు, మీర్ ఆలం ఈద్గాతో సహా సిటీలోని అన్ని మసీదులు, ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
