ఫౌల్ట్రీ యజమాని నుంచి.. రెండోసారి మంత్రిగా ఈటల

ఫౌల్ట్రీ యజమాని నుంచి.. రెండోసారి మంత్రిగా ఈటల

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ కు చెందిన ఈటల రాజేందర్ 1964 మార్చి 20న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటమ్మ, మల్లయ్య. కమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదివిన ఈటల.. 8 నుంచి 10వ తరగతి వరకు హైద్రబాద్లోని నారాయణగూడ పాఠశాలలో చదువుకున్నారు. BSC తో పాటు దూరవిద్యలో LLBలో చేరినా పూర్తి చేయలేకపోయారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం… పలిమెల గ్రామానికి చెందిన జమునా రెడ్డిని వివాహం చేస్తుకున్నారు ఈటల. వీరికి ఇద్దరు సంతానం.

బతుకుదెరువు కోసం… 1986లో హన్మకొండ సమీపంలో పౌల్ట్రీ ఫామ్ మొదలు పెట్టారు ఈటల రాజేందర్. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగారు. 2001లో టీఆర్ఎస్ లో చేరిన ఈటల.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2004లో మొదటిసారి కమాలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన 2008, 2010 ఉప ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 , 2014, 2018 సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు ఈటల.

వైఎస్ హయాంలో ఏపీ అసెంబ్లీలో… TRSLP నేతగా ఉన్న ఈటల.. తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో.. ఆర్థిక, ప్రణాళిక శాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వహించారు.