- మాజీ మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్: హుజూరాబాద్ బై ఎలక్షన్లో విజయం బీజేపీదేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరి తీరుతుందని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల కోసం నియమించిన పార్టీ ఇన్చార్జ్లతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ సమావేశమయ్యారు. హుజూరాబాద్ లో ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, సహాయ ఇన్చార్జ్లు, నియోజకవర్గ పరిధిలోని మండల ఇన్చార్జ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హుజూరాబాద్లో గెలుపు కోసం టీఆర్ఎస్ నేతలు నీచమైన విధానాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎన్ని చేసినా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ హుజురాబాద్ ప్రజల ప్రేమను, విశ్వాసాన్ని పొందలేరన్నారు. ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం లేవనెత్తుతున్నారని చెప్పారు. కేసీఆర్ను తెలంగాణ ప్రజలు అందరూ తిరస్కరిస్తున్నారని, ఆయన అబద్ధాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. హుజురాబాద్ ఎన్నికను కేసీఆర్ లైఫ్ అండ్ డెత్ సమస్యగా భావిస్తున్నారని, అందుకే వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఈటల అన్నారు.