- దమ్ముంటే కంటోన్మెంట్కు
- కరెంట్ కట్చెయ్ చూద్దాం
- కేటీఆర్కు బండి సంజయ్ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: కంటోన్మెంట్ కు కరెంట్, నీళ్లు కట్ చేస్తామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ‘దమ్ముంటే కరెంట్ కట్ చెయ్ చూద్దాం’ అని ఆయన సవాల్ చేశారు. కంటోన్మెంట్లో ఉండే సైనికులు సిటీకి రక్షణగా ఉంటారని, అలాంటిది కంటోన్మెంట్ విషయంలో అసెంబ్లీ వేదికగా కేటీఆర్ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలని, అంతే తప్ప ఇష్టమున్నట్లు మాట్లాడొద్దన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణ ద్రోహులే కాదు.. దేశ ద్రోహులు కూడా అని ఆయన ఫైర్ అయ్యారు. ఆదివారం బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను బండి సంజయ్ చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘పాతబస్తీలో ఏండ్ల తరబడి పేరుకుపోయిన కరెంట్ బిల్లులను వసూలు చేయడం చేతగాని దద్దమ్మ.. కంటోన్మెంట్ కు కరెంట్, నీళ్లు కట్ చేస్తమని చెప్పడం సిగ్గు చేటు. నీ పవర్ను తెలంగాణ పబ్లిక్ కట్ చేసుడు ఖాయం. ఇట్లనే దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తే.. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఉరికించి కొట్టుడు ఖాయం” అని హెచ్చరించారు. కంటోన్మెంట్పై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సైనికుల త్యాగాలను అవమాన పర్చేలా సర్జికల్ స్ట్రయిక్స్పై సీఎం కేసీఆర్ కామెంట్లు చేశారని, ఆయన దేశ సైనికులకు, వీర సైనికుల కుటుంబాలకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సంజయ్ అన్నారు. యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని, న్యాయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సంజయ్ తెలిపారు. ‘‘కేసీఆర్ ఫాంహౌస్కు పోతుంటే ఆ ప్రాంతమంతా ట్రాఫిక్, దుకాణాలు, వ్యాపారాలన్నీ బంద్ చేస్తరు. ఇట్లా చేసుడుతోటి ప్రజలు నానా ఇబ్బందులు పడ్తున్నరు” అని సంజయ్ అన్నారు.
వాస్తవాలను చూపించిన ‘కాశ్మీర్ ఫైల్స్’..
కాశ్మీర్ పండిట్లపై ఎటువంటి దాడులు జరిగాయో ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలో చూపించారని, కాశ్మీర్ లోని వాస్తవాలను బయటపెట్టారని సంజయ్ చెప్పారు. సినిమాలో చూపించినట్లు కాశ్మీర్లో ఎన్నో ఏండ్ల నుంచి అరాచకాలు జరుగుతున్నయని, గతంలో ఇలాంటి సినిమాలు తీసినోళ్లు, నటించినోళ్లు బతుకుతరో లేదో తెలిసేది కాదని అన్నారు. ‘‘1990 లో కాశ్మీర్ పండిట్లు, హిందువులు ఊచకోతకు గురయ్యారు. సర్జికల్ స్ట్రయిక్ జరిగిందో.. లేదో.. అన్న నేతలకు ఈ సినిమా చూస్తే వాస్తవాలు తెలుస్తయి. ఆర్టికల్ 370 రద్దుపై నిజాలు, గతంలో పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు ఏం చేశారో వంటి విషయాలను సినిమాలో చూపించిన్రు”అని సంజయ్ చెప్పారు.
ప్రతి భారతీయుడు ‘కాశ్మీర్ ఫైల్స్’ చూడాలి: తరుణ్ చుగ్
ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సూచించారు. ఈ సినిమా మాస్టర్ పీస్ అని, ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు వివేక్ అగ్నిహోత్రికి థ్యాంక్స్ చెప్తున్నట్లు ఆదివారం ట్విట్ చేశారు. కాశ్మీర్ పండిట్లు ఎదుర్కొన్న సమస్యలను ఇందులో చూపించారని, దశాబ్దాలుగా మీడియా పబ్లిక్కు చెప్పని విషయాలను ఈ సినిమా చూపించిందని ఆయన పేర్కొన్నారు.