దేశంలో కరోనాకు ఇంకొకరు బలయ్యారు. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. కేసుల సంఖ్య 81కి పెరిగింది. దీంతో రాష్ట్రాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. వైరస్ మరింత ముదరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, పబ్బులు, స్విమ్మింగ్పూళ్లు, బార్లను క్లోజ్ చేశాయి. కర్నాటక సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చేసింది. అంతేకాదు, ఎగ్జిబిషన్లు, సమ్మర్ క్యాంపులు, కాన్ఫరెన్సులను రద్దు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అంతేకాదు, కరోనా ఎఫెక్ట్ పెళ్లిళ్లు, బర్త్డే పార్టీలను వదల్లేదు. ఇకపై ఓ వారం పాటు రాష్ట్రంలో ఎలాంటి పెళ్లిళ్లు, బర్త్డే పార్టీలను జరపొద్దని కరాఖండిగా తేల్చి చెప్పింది కన్నడ సర్కారు. శుక్రవారం సీఎం బీఎస్ యెడియూరప్ప రాష్ట్రంలో అన్నింటినీ వారం రోజుల పాటు బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పబ్బులు, నైట్క్లబ్లన్నింటినీ మూసేస్తున్నట్టు చెప్పారు.
గుల్బర్గాలో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు అతడు కాంటాక్ట్ అయిన 46 మందిని గుల్బర్గాలో క్వారెంటైన్ చేసినట్టు గుల్బర్గా డిప్యూటీ కమిషనర్ బి. శరత్ చెప్పారు. అందులో 31 మంది హై రిస్క్ కేటగిరీలో, 13 మంది తక్కువ రిస్క్ కేటగిరీలో ఉన్నారని అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో నలుగురికి ఫ్లూ లక్షణాలున్నాయని, వాళ్ల శాంపిళ్లను టెస్టుల కోసం పంపించామని తెలిపారు. బెంగళూరులోని గూగుల్ ఎంప్లాయికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇటీవలే గ్రీక్ నుంచి వచ్చిన 26 ఏళ్ల యువకుడికి వైరస్ సోకిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అతడు కాంటాక్ట్ అయిన వారందరినీ గుర్తించామని, వాళ్లలో లక్షణాలు లేవని చెప్పింది. మార్చి 6న గ్రీక్ నుంచి ముంబైకి, అక్కడి నుంచి బెంగళూరుకు మార్చి 8న వచ్చినట్టు చెప్పింది. ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి సెలవులన్నింటిని ప్రభుత్వం రద్దు చేసింది. హాలిడేస్లోనూ పనిచేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. రెండో శనివారం, ఆదివారం సహా ఇతర ప్రభుత్వ సెలవు రోజుల్లోనూ డ్యూటీ చేయాల్సిందిగా ఉత్తర్వులిచ్చింది. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, సౌత్కొరియా, శ్రీలంకలకు ఎయిరిండియా ఏప్రిల్ దాకా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 19న నిర్వహించాలనుకున్న 81వ రైజింగ్ డే వేడుకలను, 51వ బ్యాచ్ డీఏజీవో పాసింగ్ అవుట్ పరేడ్ను సీఆర్పీఎఫ్ వాయిదా వేసింది.
మిగతా రాష్ట్రాలూ
ఒడిశాలో విద్యా సంస్థలన్నింటినీ మార్చి 31 వరకు క్లోజ్ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. కొవిడ్పై పోరాటానికి రూ.200 కోట్లు విడుదల చేశారు. సెమినార్లు, వర్క్షాపులు, కాన్ఫరెన్స్లన్నింటినీ రద్దు చేశారు. పెళ్లిళ్లు, బర్త్డే పార్టీలు, మత సంబంధ కార్యక్రమాల వంటి వాటికి స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. సినిమాహాళ్లు, స్విమ్మింగ్ పూళ్లు, జిమ్ములు బంద్ అవుతాయన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాలూ స్కూళ్లు, కాలేజీలకు మార్చి 31 వరకు సెలవులిస్తున్నట్టు ప్రకటించాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో మరో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పోయిన వారం అమెరికా నుంచి భార్యతో పాటు ఇండియాకు వచ్చిన 46 ఏళ్ల వ్యక్తికి వైరస్ ఉందని, అతడిని కలిసిన 15 మందిని క్వారెంటైన్లో పెట్టి టెస్టులు చేయగా, అతడి భార్య, స్నేహితుడికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందన్నారు. హర్యానాలోని మనేసర్లో ఉన్న ఆర్మీ క్వారెంటైన్లో ఉన్న వ్యక్తికీ పాజిటివ్ వచ్చింది. గ్రేటర్ నోయిడాలోని ఓ లెదర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి కొవిడ్ పాజిటివ్ రావడంతో, ఆ కంపెనీలో పనిచేస్తున్న 707 మందిని క్వారెంటైన్లో పెట్టారు. ఢిల్లీలోని జేఎన్యూ, జామియా మిలియా, ఢిల్లీ యూనివర్సిటీలకు మార్చి 31 దాకా సెలవులిచ్చారు.
బ్రెజిల్ ప్రెసిడెంట్కు.. కెనడా ప్రధాని భార్యకు.. ఆస్ట్రేలియా మంత్రికి
సామాన్యులకే కాదు.. పాలకులనూ కరోనా వదలట్లేదు. మొన్నటికి మొన్న ఇరాన్ ఎంపీలకు వైరస్ సోకితే, తాజాగా ఓ దేశాధినేతకు, ఓ దేశాధినేత భార్యకూ కరోనా వైరస్ అంటింది. బ్రెజిల్ ప్రెసిడెంట్ జెయిర్ బోసనారోకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆయన ప్రెస్ సెక్రటరీ ఫాబియో వనగార్టెన్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన శాంపిళ్లనూ టెస్టులకు పంపించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ భార్య సోఫీ గ్రెగరీకి కొవిడ్ పాజిటివ్గా తేలింది. గురువారం ఆమె శాంపిళ్లను టెస్టులకు పంపించగా పాజిటివ్ వచ్చిందని, ఆమె సెల్ఫ్ క్వారెంటైన్ అయ్యారని ప్రధాని ఆఫీస్ అధికారులు తెలిపారు. దీంతో ప్రధాని కూడా ఆఫీసుకు రాకుండా ఇంట్లోనే ఐసోలేట్ అయ్యారని, ఇంటి నుంచే పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ట్రూడూ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి పీటర్ డుట్టన్కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొద్ది రోజుల కిందట అమెరికాలో ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్తో ఆయన సమావేశమయ్యారట.
కరోనా మృతులు 5 వేలు
ఇటలీలో మరణాల రేటు దారుణంగా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 5 వేల మంది కొవిడ్కు బలయ్యారు. 1,32,000 మంది దాని బారిన పడ్డారు. చైనాలో మరణాలు, కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 80,815 కేసులు అక్కడ రికార్డవగా, 3,177 మంది చనిపోయారు. ఇటలీలో చనిపోయిన వాళ్ల సంఖ్య వెయ్యి దాటేసింది. 1,016 మంది కొవిడ్కు బలయ్యారు. 15,113 కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం 10 వేల కేసులే ఉండగా, ఇప్పుడు 15 వేల మార్కును దాటేశాయి. ఇరాన్లో 514 మంది చనిపోయారు. దక్షిణ కొరియాలో 71, స్పెయిన్లో 120, ఫ్రాన్స్లో 61 మంది చనిపోయారు. అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 41కి పెరిగింది. కేసులు 1,832 నమోదయ్యాయి.
అనవసరంగా కలిశానా?
అనవసరంగా అందరినీ కలుస్తున్నానంటూ సన్నిహితుల దగ్గర అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాపోయినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మారా లాగోలో ఆయన బ్రెజిల్ ప్రెసిడెంట్ బోసనారోతో పాటు వనగార్టెన్తో సమావేశమయ్యారు. వాళ్లిద్దరికీ కరోనా పాజిటివ్ రావడంతో ట్రంప్లో కలవరం మొదలైందని అధికార వర్గాలు అంటున్నాయి. ఆయనకు మాత్రం ఎలాంటి లక్షణాలు లేవని, టెస్టులూ అవసరం లేదని వైట్హౌస్ అధికారులు చెబుతున్నారు. టెస్టులూ అవసరం లేదంటున్నారు. ఇటు, తాజాగా అమెరికా మొత్తం నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు ప్రెసిడెంట్ ట్రంప్. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు.
ప్రపంచ దేశాలూ క్లోజ్ చేసినయ్
అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను బంద్ పెట్టారు. జపాన్ ఎమర్జెన్సీ చట్టాన్ని చేసింది. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ‘ఎమర్జెన్సీ గవర్నమెంట్’ను ఏర్పాటు చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కోరారు. ఫ్రాన్స్లో అన్ని స్కూళ్లను వారం పాటు మూసేయనున్నారు. పాకిస్థాన్ మే 31 దాకా సెలవులిచ్చేసింది. స్కూళ్లు, కాలేజీలను బంద్పెట్టిన లగ్జెంబర్గ్ సర్కార్, హాస్పిటళ్లు, నర్సింగ్ హోంలలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వృద్ధులను కలిసేందుకు పరిమితులు విధించింది. రోమ్లో చర్చిలన్నీ ఏప్రిల్ 3 వరకు బంద్. స్పెయిన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. దాదాపు అన్ని టౌన్లను మూసేశారు.
ఇరాన్ నుంచి మరో 44 మంది
కొవిడ్ ప్రభావిత ఇరాన్ నుంచి మరో 44 మంది ఇండియన్లు దేశానికి తిరిగొచ్చారు. శుక్రవారం ఇరాన్ ఎయిర్కు చెందిన విమానంలో వాళ్లంతా ముంబైకి వచ్చారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు. ‘‘రెండో బ్యాచ్లో ఇరాన్ నుంచి 44 మంది ఇండియాకు తిరిగొచ్చేశారు. మిగతా వాళ్లనూ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇరాన్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు, మెడికల్ సిబ్బంది కలిసి అక్కడి వాళ్లకు టెస్టులు చేస్తున్నారు. ఇరాన్ అధికారులు సపోర్ట్ చేస్తున్నారు’’ అని ఆయన ట్వీట్ చేశారు.