ప్రధాని మోడీపై వారణాసిలో మాజీ సైనికుడి పోటీ

ప్రధాని మోడీపై వారణాసిలో మాజీ సైనికుడి పోటీ

వారణాసి : ఉత్తర్ ప్రదేశ్ లో ఆసక్తికరమైన లోక్ సభ సమరం కనిపించే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు ఓ మాజీ సైనికుడు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయనే బీఎస్ఎఫ్ లో గతంలో పనిచేసి తొలగించబడిన జవాన్ తేజ్ బహదూర్ యాదవ్.

తేజ్ బహదూర్ యాదవ్ సొంత రాష్ట్రం హర్యానా. రేవాడి ఆయన సొంత ఊరు. 2017లో ఇండోపాక్ సరిహద్దులో BSF 29వ బెటాలియన్ లో కానిస్టేబుల్ హోదాలో ఆయన పనిచేశారు. సైన్యానికి బీఎస్ఎఫ్ అందిస్తున్న ఆహారంలో క్వాలిటీ లేదంటూ తేజ్ బహదూర్ యాదవ్ తీసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. దేశమంతటా దుమారం రేపింది. తేజ్ బహదూర్ చేసిన ఆరోపణలను సైన్యం కొట్టిపారేసింది. విచారణ జరిపించి… అత్యంత నాణ్యమైన ఆహారం, వసతులు సైనికులకు అందుతున్నాయని… ఆధారాల్లేని ఆరోపణలు చేశారంటూ తేజ్ బహదూర్ ను ఉద్యోగం నుంచి తొలగించింది.

ఇపుడు లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి వార్తల్లోకి వచ్చారు తేజ్ బహదూర్ యాదవ్. సైన్యం విషయంలో కేంద్రం విధానాలపై విమర్శలు చేస్తూ వస్తున్న తేజ్ బహదూర్.. మోడీ నియోజకవర్గం వారణాసి నుంచి లోక్ సభకు పోటీ పడాలని నిర్ణయించారు. పోటీ చేస్తే టికెట్ ఇస్తామని పలు పార్టీలు తనను సంప్రదించాయన్న తేజ్ బహదూర్…. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన డిసైడైనట్టు వివరించారు. మాజీ సైనిక ఉద్యోగులు… రైతుల మద్దతు కూడగట్టి.. త్వరలోనే వారణాసిలో ప్రచారం మొదలుపెడతానని చెప్పారు తేజ్.

“ఎన్నికల్లో నేను గెలవాలని పోటీ చేయడం లేదు. కానీ… సైనికుల సమస్యలను హైలైట్ చేయాలనేదే నా ప్రయత్నం. పారామిలటరీ ఫోర్స్ ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నేను చేసిన ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించాల్సింది. సైన్యం విభాగాల్లో అవినీతిపై దృష్టిపెట్టాల్సింది. ఆ పని జరగలేదు కాబట్టే పోటీలో నిలబడతున్నా” అని తేజ్ బహదూర్ చెప్పారు.