
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగానికి రిజైన్ చేసిన మాజీ డీఎస్పీ నళిని శనివారం ( డిసెంబర్ 30) సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. తాను మర్యాద పూర్వకంగా కలిశానని నళిని తెలిపారు, మాజీ డీఎస్పీ తిరిగి ఉద్యోగంలో చేరనన్నారు. తాను ఆధ్యాత్మిక బాటలోనే జీవితం కొనసాగిస్తానని తెలిపారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు.