నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే భగత్​ క్వార్టర్​ స్వాధీనం

నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే  భగత్​ క్వార్టర్​ స్వాధీనం
  • నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఆఫీసర్ల నిర్ణయం
  • ఇంట్లోని  సామగ్రిని ఎన్​ఎస్పీ స్టోర్​రూమ్ కు తరలింపు

హాలియా, వెలుగు:  నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ (నందికొండ) మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో  సాగర్​ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ కు కేటాయించిన ఈఈ 19 నెంబర్  క్వార్టర్​ను మంగళవారం సాయంత్రం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు , పెద్దవూర తహసీల్దార్ పావని సరోజ , ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి , సాగర్ సీఐ భీసన్న , ఎస్సై సంపత్ గౌడ్ ,  నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏ ఈ భిక్షమయ్య ఆధ్వర్యంలో క్వార్టర్​లోని వస్తువులను నందికొండ మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఎన్​ఎస్పీ  స్టోర్ రూమ్ కు తరలించారు. అనంతరం క్వార్టర్​గేట్లకు తాళాలు వేసి సీజ్​చేశారు. 

సాగర్ డ్యామ్ ఈఈ మల్లికార్జునరావు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కోసం  క్వార్టర్​ ఖాళీ చేసి అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే భగత్​కు పలుమార్లు నోటీసులు అందజేసినా స్పందనలేదన్నారు. దీంతో రెవెన్యూ, పోలీస్​ ఆఫీసర్ల సమక్షంలో క్వార్టర్​ను ఖాళీ చేయించి , సీల్​ వేసినట్లు చెప్పారు. కాగా,  తనకు ఎలాంటి  సమాచారం ఇవ్వకుండా  ఎన్​ఎస్పీ అధికారులు  క్వార్టర్​ను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని మాజీ  మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. దీనికి నిరసనగా క్వార్టర్​ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. విషయం తెలిసి  మాజీ ఎమ్మెల్యే భగత్​అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అలీనగర్​ వద్ద హాలియా పోలీసులు ఆపి నచ్చజెప్పారు. అనవసరంగా లా అండ్​ ఆర్డర్​ సమస్య సృష్టించవద్దని చెప్పడంతో తిరిగి హైదరాబాద్​ వెళ్లిపోయారు.