ఢిల్లీలో మాజీ మోడల్​ హత్య

ఢిల్లీలో మాజీ మోడల్​ హత్య
  • హోటల్​ రూమ్​లో చంపేసిన ఫ్రెండ్​
  •  సీసీటీవీ ఫుటేజీలో శవాన్ని లాక్కెళుతున్న దృశ్యాలు

న్యూఢిల్లీ :  దేశ రాజధానిలో మాజీ మోడల్, గ్యాంగ్​స్టర్ మాజీ ప్రియురాలు హత్యకు గురైంది. సదరు గ్యాంగ్​స్టర్ కూడా ఇటీవలే ఓ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. అది ఫేక్ ఎన్ కౌంటర్ అని, దాని వెనక గ్యాంగ్​స్టర్ ప్రియురాలు ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యువతి హత్యకు గురికావడం గురుగ్రామ్ లో సంచలనం సృష్టించింది. ఎన్ కౌంటర్ లో చనిపోయిన గ్యాంగ్ స్టర్  సందీప్ గడోలి కాగా ఇప్పుడు హత్యకు గురైంది అతడి మాజీ ప్రియురాలు దివ్య పహుజా. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దివ్య పహుజా (27) కనిపించడంలేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 1న ఆమె తన స్నేహితుడు, సిటీ పాయింట్​ హోటల్​ ఓనర్ అభిజిత్ సింగ్​ తో కలిసి బయటకు వెళ్లిందని చెప్పారు. అలా వెళ్లిన దివ్య రెండు రోజులు గడిచినా ఇంటికి తిరిగి రాలేదని వివరించారు. దీంతో దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు.. గురుగ్రామ్​లోని సిటీ పాయింట్ హోటల్​లో సోదాలు చేయగా.. అభిజిత్​ సింగ్​తో కలిసి దివ్య మంగళవారం రాత్రి హోటల్ లోకి ఎంటర్ అవడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

అదే రాత్రి దివ్యను అభిజిత్ సింగ్​ చంపేసాడని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి రూమ్​ లో నుంచి బయటకు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ పని కోసం అభిజిత్ తన సహాయకులు  ప్రకాష్, ఇంద్రరాజ్ లను ఉపయోగించుకున్నాడు. దివ్య డెడ్ బాడీని గదిలో నుంచి బయట ఉన్న కారులోకి చేర్చినందుకు వారికి రూ.10 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు. కాగా, గ్యాంగ్ స్టర్ సందీప్ ఎన్ కౌంటర్ తర్వాత జైలుకు వెళ్లిన దివ్య పహుజా గతేడాదే బయటకు వచ్చింది.