న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో మనదేశం పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాలను అమలు చేయడం, ఆశించిన ఆర్థిక వృద్ధి ఉండటం వంటివి మనదేశానికి మేలు చేస్తాయని అంటున్నారు. వ్యాపారం చేయడంలో సౌలభ్యం, నైపుణ్యం కలిగిన మానవశక్తి, సహజ వనరులు బాగుండటం, సరళమైన ఎఫ్డీఐ విధానాలు, భారీ దేశీయ మార్కెట్, ఆరోగ్యకరంగా జీడీపీ వంటివి 2023లో భారతదేశానికి భారీగా విదేశీ డబ్బును తెచ్చిపెడతాయని చెబుతున్నారు. యూఎస్ ద్రవ్య విధానం మరింత కఠినతరం అయ్యే అవకాశాలు ఉండటం, రష్యా యుద్ధం వంటివి మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఒప్పందాల అమలులో జాప్యం, గజిబిజి విధానాలు, అధిక వడ్డీ రేట్లు ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యలేనని చెప్పాలి. యూఎన్సీటీఏడీ తాజా ప్రపంచ పెట్టుబడి నివేదిక 2022 ప్రకారం, పరిశ్రమలో గ్రీన్ఫీల్డ్ పెట్టుబడి పునరుద్ధరణ బలహీనంగా ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త పెట్టుబడులు తక్కువగా వస్తున్నాయి. ఇంధనం, ఆర్థిక సంక్షోభాలు, ఉక్రెయిన్లో యుద్ధం, కొనసాగుతున్న కరోనా మహమ్మారి, వాతావరణ అంతరాయాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. భారతదేశం 2022లో ఆశించినట్టుగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) సాధించింది. ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి–-సెప్టెంబర్ మధ్య 42.5 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2021–-22లో దేశానికి 84.84 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్డీఐలు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-–సెప్టెంబర్ కాలంలో ఇవి14 శాతం తగ్గి 26.9 బిలియన్ డాలర్లకు చేరాయి. మొత్తం ఎఫ్డీఐ ఇన్ఫ్లోలు (ఈక్విటీ ఇన్ఫ్లోలు, రీఇన్వెస్ట్ చేసిన ఆదాయాలు ఇతర మూలధనాలతో సహా) కూడా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో 42.86 బిలియన్ల నుంచి 39 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఎఫ్డీఐ విధానంలో సరళీకరణ, వ్యాపార సౌలభ్యాన్ని మరింత ప్రోత్సహించే చర్యలు, సమీకృత మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పీఎల్ఐ పథకాలు పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ప్రకటన, పరిశ్రమలకు అనుగుణమైన భారాన్ని తగ్గించడం వంటి నిర్ణయాల కారణంగా ఎఫ్డీఐలు పెరిగాయి. భారతదేశం పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తుందని పరిశ్రమల ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) కార్యదర్శి అనురాగ్ జైన్ అన్నారు. వరుసగా గత ఎనిమిది సంవత్సరాలుగా, దేశంలోకి కొత్తగా రికార్డుస్థాయిలో ఎఫ్డీఐలు వచ్చాయని జైన్ వివరించారు.
ప్రపంచం చూపు ఇండియావైపు..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఇండియాలో పీఎల్ఐ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఆసక్తిగా ఉన్నారని, అనేక ప్రపంచ సంస్థలు తమ ప్లాంట్లను, బిజినెస్లను భారతదేశానికి మార్చాలని చూస్తున్నాయని జైన్ తెలిపారు. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యుఎస్) పోర్టల్ ద్వారా వ్యాపారాలు సులువుగా అనుమతులు పొందవచ్చని, పెట్టుబడిదారులు భారతదేశానికి రావడానికి ఇది కూడా సహాయపడుతుందని అన్నారు. యూఏఈ, ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) కూడా ఎఫ్డీఐలను భారీగా ఆకర్షించగలుగుతాయని జైన్ అన్నారు. భారతదేశ తయారీ సామర్థ్యాలను, ఎగుమతులను మెరుగుపరచడానికి రూ. 1.97 లక్షల కోట్లతో వైట్ గూడ్స్, టెలికాం, ఆటో కాంపోనెంట్స్తో సహా 14 రంగాలకు పీఎల్ఐ పథకాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు 13 సెక్టార్ల కింద 650 దరఖాస్తులను ఆమోదించారు. 2022-–23లో వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కీ మజుందార్ మాట్లాడుతూ యూఎస్ నుంచి ఎఫ్డీఐలు తగ్గిపోయాయని, 2022–-23 మొదటి ఆరు నెలల్లో జపాన్, సింగపూర్, యూకే, యూఏఈల నుంచి ఈక్విటీ ఇన్ఫ్లోలలో ఆరోగ్యకరమైన పెరుగుదల ఉందని ఆమె అన్నారు. ఈ విషయమై ఇండస్లావ్ సీనియర్ వ్యవస్థాపక భాగస్వామి కార్తీక్ గణపతి మాట్లాడుతూ దేశీయ వినియోగంలో సానుకూల పెరుగుదల, సేవల మార్కెట్, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు భారతదేశ వృద్ధికి ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు. 2000 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబర్ మధ్య భారతదేశంలోకి వచ్చిన మొత్తం ఎఫ్డీఐల విలువ 887.76 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దాదాపు 26 శాతం ఎఫ్డీఐ మారిషస్ మార్గంలో వచ్చింది. ఆ తర్వాతి స్థానాల్లో సింగపూర్ (23 %), అమెరికా (9%), నెదర్లాండ్స్ (7 %), జపాన్ (6 %), యుకె (5 %) ఉన్నాయి.యుఎఇ, జర్మనీ, సైప్రస్, కేమన్ దీవులు ఒక్కొక్కటి 2 శాతంగా ఉన్నాయి. సర్వీసెస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఆటో, కెమికల్స్, ఫార్మా సెక్టార్లలోకి ఎఫ్డీఐలు ఎక్కువగా వచ్చాయి.