
న్యూఢిల్లీ: మన దేశ రక్షణ రంగ కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఇవి ఇది వరకే గణనీయమైన వృద్ధిని సాధించాయి. సికియా ఇంటర్ప్లాంట్ సిస్టమ్స్, డేటా ప్యాటర్న్స్, బీఈఎల్, బీఈఎంఎల్ వంటి డిఫెన్స్ కంపెనీల స్టాక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నాటో (నాటో) ఇటీవల ది హేగ్లో జరిగిన సమ్మిట్లో సభ్య దేశాల రక్షణ వ్యయాన్ని 2035 నాటికి జీడీపీలో ఐదుశాతానికి పెంచనున్నట్లు ప్రకటించడం. ఈ నిర్ణయం వల్ల నాటో దేశాలు ఏటా అదనంగా వందల బిలియన్ డాలర్లను డిఫెన్స్కోసం ఖర్చు చేస్తాయి. గతంలో దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారతదేశ రక్షణ రంగం, ఇప్పుడు ప్రపంచ స్థాయి సరఫరాదారుగా వేగంగా ఎదుగుతోంది. ఇటీవలి విధాన సంస్కరణలు, పెరిగిన పెట్టుబడులు, పారిశ్రామిక సామర్థ్యాల పెంపుదల భారత రక్షణ ఎగుమతులను సరికొత్త స్థాయికి చేర్చాయి.
2024–-25 ఆర్థిక సంవత్సరంలో మనదేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 23,622 కోట్లకు (సుమారు 2.76 బిలియన్డాలర్లు) చేరుకున్నాయి. ఇది 2013–-14 ఆర్థిక సంవత్సరం నుంచి 34 రెట్లు పెరుగుదల. ప్రభుత్వం 2029 నాటికి రూ. 50 వేల కోట్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ డిఫెన్స్ జర్మనీకి చెందిన రైన్మెటాల్ వాఫే మ్యూనిషన్ జీఎంబీహెచ్ నుంచి రూ. 600 కోట్ల విలువైన ఎగుమతి ఆర్డర్ను పొందడమే ఇందుకు నిదర్శనం. మన కంపెనీలు డిఫెన్స్ ప్రొడక్టుల తయారీ కోసం దసో ఏవియేషన్ థేల్స్ వంటి యూరోపియన్ డిఫెన్స్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. సబ్-సిస్టమ్స్, విడిభాగాలు, మందుగుండు సామగ్రి వంటివి తయారు చేయనున్నాయి. భెల్, హెచ్ఏఎల్వంటి ప్రభుత్వ కంపెనీలూ భారీగా ఆర్డర్లను దక్కించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి.
నాటో, యూరప్ దేశాలకు ఇండియా కీలకం
యూరప్ దేశాల సైనిక సామర్థ్యం తక్కువ ఉండటంతో ఈ దేశాలు అమెరికాపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అమెరికా రక్షణ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఈయూ భావిస్తోంది. యూరప్ సొంతగా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో భారతదేశం ఈ అంతరాన్ని పూరించేందుకు అవకాశాలు ఉన్నాయి. యూరోపియన్ రక్షణ ఉత్పత్తుల తయారీ సామర్థ్యం పరిమితంగా ఉంది. నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి కొరత తీవ్రంగా ఉంది. మన దేశానికి ఈ సమస్యలు లేవు. భారతదేశంలో శ్రామికశక్తి అపారంగా ఉంది. నైపుణ్యాలకూ కొరత లేదు. ధర, సామర్థ్యం, విశ్వసనీయతపరంగా చూసినా ఇండియా ఈయూకు మంచి చాయిస్ అవుతుంది. మన దగ్గర తక్కువ ధరకే తయారీ సాధ్యమవుతుంది.
భారీ ప్లాంట్లూ, టెక్నాలజీలూ అందుబాటులో ఉన్నాయి. తేజస్, బ్రహ్మోస్ ద్వారా ఇండియా తన సత్తా చాటింది. అంతేగాక మనదేశానికి అనేక యూరప్ దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. చాలా దేశాలు వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తున్నాయి. చైనా లేదా రష్యా నుంచి వచ్చే ఎగుమతుల కంటే భారతీయ రక్షణ ఎగుమతులకు మరింత ప్రాధాన్యం దక్కవచ్చు. మనదేశానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, భారతీయ సంస్థలు నాటో విధించిన కఠినమైన నాణ్యత ప్రమాణాలను పాటించాలి. సకాలంలో డెలివరీలను ఇవ్వాలి. నియంత్రణపరమైన అడ్డంకులను దాటాలని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.