ప్రియుడి కోసం.. USB కేబుల్ తో భర్తను ఉరి వేసింది

ప్రియుడి కోసం.. USB కేబుల్ తో భర్తను ఉరి వేసింది

తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలసి హతమార్చింది. మద్యం మత్తులో ఉన్న భర్తని… ప్రియుడు,అతని స్నేహితుడి సహాయంతో చంపి, ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా తన భర్త కనబడటం లేదని పీఎస్ లో కంప్లయింట్ ఇచ్చింది. ఎంక్వయిరీ చేపట్టిన పోలీసులకు ఒక బిఎస్ఎన్ఎల్ అధికారి భార్య అయి ఉండి ఆమె చేసిన దారుణాన్ని తెలుసుకొని నివ్వెర పోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాలోని షాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే వీరేందర్ కుమార్ అనే వ్యక్తికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. బిఎస్ఎన్ఎల్ సంస్థలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న వీరేందర్..  భార్య, ఇద్దరు పిల్లలతో కలసి పంచశీల్ కాలనీలో నివాసముండేవాడు. అయితే అతని భార్యకు, సౌత్ జోన్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో పని చేసే ఓ ఇంజినీర్ తో అక్రమ సంబంధం ఏర్పడింది. అతని మాయలో పడి భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనుకుంది.  పథకం ప్రకారం ప్రియుడితో కలసి అతన్ని హత్య చేయాలనుకొంది.

ప్రియుడు చెప్పినట్టుగా శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న వీరేందర్ ను మొబైల్ ఫోన్ కు వాడే USB కేబుల్ తో ఉరి వేసి చంపింది. ఆ తర్వాత వారిద్దరితో పాటు, ప్రియుడు స్నేహితుడు ముగ్గురూ  కలసి శవాన్ని ఇంటికి దూరంగా ఓ నిర్జన ప్రదేశంలో పడేసి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం తన భర్త కనిపించడం లేదంటూ పోలీసు కంప్లయింట్ ఇచ్చింది. ఆ కంప్లయింట్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులకు… వీరేందర్ భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉండేదని, అతని వల్ల భార్యాభర్తలకు గొడవలు జరిగేవని చుట్టూ పక్కల వాళ్లు, వీరేందర్ కుటుంబ సభ్యులు చెప్పారు.

దీంతో పోలీసులు మంగళవారం భార్యని, ప్రియుడిని ఇద్దరిని అదుపులోకి తమ పద్ధతిలో విచారణ చేయగా.. తామే వీరేందర్ ని హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఈ పని చేశామన్నారు. USB కేబుల్ తో ఉరి వేశామని,  ఆ తర్వాత శవాన్ని ఇంటికి దూరంగా ఓ ఖాళీ ప్రదేశంలో పడేశామని చెప్పారు. ఈ హత్యకు సహకరించిన ఆమె ప్రియుడి స్నేహితుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Extramarital affair ends with wife, lover strangling husband to death with USB cable