కోరుట్లలో నకిలీ పాస్​పోర్టుల తయారీ.. అదుపులో నిందితులు

 కోరుట్లలో నకిలీ పాస్​పోర్టుల తయారీ.. అదుపులో నిందితులు

కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం ముగ్గురు పాస్ పోర్ట్ ఏజెంట్ల ఇండ్లలో సీఐడీ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నకిలీ  పాస్​పోర్ట్​లు తయారు చేస్తున్నారని హైదరాబాద్ సీఐడీ ఆఫీసులో కేసు నమోదు కావడంతో రాంనగర్​లోని అశోక్, సంగెం రోడ్డులో ఉండే కమురొద్దీన్, ఐబీ రోడ్డులోని చాంద్ ఖాన్ ఇండ్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నలు గురు సీఐడీ డీఎస్పీల పర్యవేక్షణలో మూడు టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి.

శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు మొదలయ్యాయి. తర్వాత ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నకిలీ పాస్ పోర్టులు, అవి తయారు చేయడానికి ఉపయోగించే మెటీరియల్ , నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.  సీఐడీ అధికారులు మాత్రం వివరాలు వెల్లడించలేదు. సీఐడీ డీఎస్పీలు నందిరామ్, సంపత్ , రవీందర్, వెంకటేశ్​10 మంది  సీఐలు,  ఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు. 

జిల్లా కేంద్రంగా దందా.. 

కొంత కాలంగా జగిత్యాల జిల్లా కేంద్రంగా నకిలీ పాస్​పోర్టులు తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంది. శుక్రవారం ముగ్గురి ఏజెంట్ల ఇండ్లలో తనిఖీలు నిర్వహించగా ఒక ఏజెంట్​గతంలో దొంగ పాస్​పోర్టుల వ్యవహారంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని తేలింది. నకిలీ పాసుపోర్టులతో కొందరిని విదేశాలకు కూడా పంపినట్టు సమాచారం. దీంతో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారని సీఐడీ ఆరా తీస్తునట్టు తెలిసింది.