- తమకే ప్రజామోదం ఉందంటూ అభ్యర్థుల అనుచరుల పోస్ట్లు
- ప్రముఖ మీడియా, సర్వే సంస్థల పేరిట రిపోర్టులు
- ఓటర్లను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం అంటున్న పలువురు
కరీంనగర్, వెలుగు : కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫేక్ సర్వేలు, ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ రిపోర్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మా పార్టీ అభ్యర్థే లీడింగ్లో ఉన్నారంటూ పార్టీల వారీగా పర్సంటేజీలతో కూడిన టేబుళ్లను రూపొందించి వాట్సప్, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారు.
ఈ సర్వేలు నిజమని నమ్మించేందుకు ప్రముఖ మీడియా, పొలిటికల్ స్ట్రాటజీ సంస్థల పేర్లు, లోగోలను జోడిస్తున్నారు. దీంతో ఆ సర్వేలు నిజమో, అబద్ధమో తెలియక జనం గందరగోళానికి గురవుతున్నారు. ఓటర్లంతా తమ వైపే ఉన్నారని ప్రచారం చేయడం కోసమే కొందరు క్యాండిడేట్లు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వార్డుల వారీగా సర్వేలు, ప్రీ పోల్స్
ఎన్నికల్లో ఓటరు నాడికి సంబంధించి సర్వే, ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ పేరిట పార్టీలు, అభ్యర్థులవారీగా పర్సంటేజీలతో కూడిన చార్ట్లను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 37 నుంచి 40 సీట్లను తమ పార్టే గెలుచుకోబోతోందని ఓ సంస్థ పేరుతో కొందరు వ్యక్తులు ఫేక్ సర్వేను ప్రకటించారు. మేయర్ స్థానానికి అవసరమైన మేజిక్ ఫిగర్ దాటి తమకు సీట్లు వస్తాయని, వార్ వన్సైడ్ అన్నట్లుగా ఈ చార్ట్లను రూపొందిస్తున్నారు.
తమ ప్రత్యర్థి పార్టీలకు ఒక్కో పార్టీకి 10 సీట్లలోపే రానున్నట్లు ఆ సర్వేల్లో చూపుతున్నారు. అలాగే కొన్ని డివిజన్లు, వార్డుల్లోనూ అభ్యర్థుల వారీగా కూడా ఇలాంటి ఫేక్ సర్వే రిపోర్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు కొందరు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు సైతం సోషల్ మీడియా వింగ్ నుంచి ఇలాంటి ఫేక్ రిపోర్టులు సర్క్యులేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇందులో ఏ సర్వే కూడా నమ్మశక్యంగా, వాస్తవానికి దగ్గరగా లేకపోవడం గమనార్హం.
ప్రముఖ సంస్థల పేరు వాడుకుంటూ...
సర్వేలను ప్రచారం చేస్తున్న పార్టీలు, అభ్యర్థుల సోషల్ మీడియా వింగ్లు తాము రిలీజ్ చేసే రిపోర్టులకు ప్రామాణికత ఉండేలా, జనాలు నమ్మేలా ఉండడం కోసం ప్రముఖ మీడియా, పొలిటికల్ స్ట్రాటజీ సంస్థల పేర్లు, లోగోలను అక్రమంగా వాడుకుంటున్నారు. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ‘వీ6 వెలుగు’ సర్వే పేరిట సంస్థ లోగోతో ఫేక్ రిపోర్టులు వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ అలుగునూరు పరిధిలోని ఎనిమిదో డివిజన్లో ‘వీ6 వెలుగు’ లోగోతో తప్పుడు సర్వేను ప్రచారంలోకి తీసుకొచ్చారు. అలాగే ప్రముఖ స్ట్రాటజీ, సర్వే సంస్థలైన పీపుల్స్ పల్స్, డీప్డౌన్ అనాలిసిస్, ఆపరేషన్ చాణక్య వంటి సంస్థల పేర్లను సైతం వాడేస్తున్నారు.
