భూదాన్ పోచంపల్లి, వెలుగు: డాక్టర్ పేరుతో దంపతులను నమ్మించిన ఓ కేటుగాడు బంగారు నగలతో పరారయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్లో ఓ దంపతులను దండగుడు లక్ష్యంగా చేసుకున్నాడు. తాను కేరళ యునాని డాక్టర్నని నమ్మించి గాంధీనగర్లోని వంగూరి ప్రణీత అనే వివాహిత ఇంట్లోకి ప్రవేశించాడు. తాను ఇచ్చే మందుతో 40 రోజుల్లో ఫలితం వస్తుందని నమ్మబలికాడు.
మందు పనిచేయాలంటే మెడలో బంగారం ఉండకూడదని చెప్పి బాధితురాలి నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు తీసుకున్నాడు. అనంతరం లిక్విడ్ రాస్తున్నట్టు నటించి ఆమెను స్నానానికి పంపి బంగారంతో పరారయ్యాడు. స్నానం చేసి వచ్చిన తర్వాత అతడు కనిపించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.
