తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై తిరుపతిలోని లక్ష్మీపురం, కెనడీనగర్ కూడలి దగ్గర దగ్గర టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఎన్నికల సంఘం, పోలీసులు దొంగ ఓట్లపై ఏ మాత్రం దృష్టి సారించడంలేదని ఆరోపించారు. బయటి వ్యక్తులను అదుపులోకి తీసుకోకపోగా తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. బస్సులు, కార్లు ఆపి నకిలీ ఓటర్లను టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు దించేశారు. వారి నుంచి నకిలీ ఓటరు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు వేలమందిని తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.దీనికి సంబంధించి సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలోకి బయటి వ్యక్తులు చొరబడ్డారని తెలియజేస్తూ ఫొటో ఆధారాలను జత చేసి సీఈవోకు టీడీపీ అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. రెండు బస్సుల్లో వైసీపీ నేతలు బయటి వ్యక్తుల్ని తరలించాలని లేఖలో తెలిపారు. అంతేకాదు..వైసీపీ నేతలు కొన్ని బూత్లలో టీడీపీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని వివరించారు.
మరోవైపు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ఓట్లు వేసేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో పోలింగ్ కేంద్రం వెలవెలబోయింది. తమ పంచాయతీని శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో విలీనం చేయరాదని నిరసనగా గ్రామస్థులు ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు రెండు రోజుల కిందట ప్రకటించారు. ముందుగా చెప్పినట్టుగానే ఇవాళ ఓటు వేయడానికి ప్రజలు నిరాకరించారు.