- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన కుటుంబసభ్యులు
- పది మంది దారుణంగా కొట్టడంతో యువకుడి మృతి
- మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో ఘటన
ఘట్ కేసర్, వెలుగు : బాలికతో ప్రేమ వ్యవహారం యువకుడి హత్యకు దారి తీసింది. బాలిక కుటుంబసభ్యులు యువకుడిని దారుణంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారంలోని ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్కు చెందిన ధరావత్ సుశీల కొడుకు ధరావత్ కరణ్(18)తో కలిసి 15 ఏండ్ల కిందట సిటీకి వచ్చి పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని లక్ష్మినర్సింహా కాలనీలో రెంట్కు ఉంటోంది.
సుశీల కూలి పని చేస్తోంది. కరణ్ తన ఇంటికి సమీపంలో ఉండే ఓ బాలిక(15) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. బుధవారం రాత్రి కరణ్ బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమెతో కలిసి కరణ్ ఓ రూమ్లో ఉండగా.. బాలిక కుటుంబసభ్యులు అతడిని పట్టుకున్నారు. 10 మంది కుటుంబసభ్యులు కరణ్ను కర్రలతో చితకబాదారు. ప్రైవేటు పార్ట్స్పై కారం చల్లి 3 గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. మరోసారి బాలిక జోలికి రావొద్దని హెచ్చరించి వదిలేశారు. తీవ్రంగా గాయపడ్డ కరణ్ అలాగే ఇంటికి చేరుకున్నాడు.
ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తల్లి సుశీల అతడిని హాస్పిటల్కు తీసుకెళ్లగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. సుశీల ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు.. కరణ్పై దాడికి పాల్పడ్డ బాలిక కుటుంబసభ్యులు శింగాడే దోండియా (45), రాధాబాయి (34), సురేష్ (30), సుధీర్ (20), మాధవ్ (30), కందు(45), జల్బా (32), గజానంద్ (27) తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి డెడ్ బాడీని గాంధీకి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్, ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు.