హత్యకు దారి తీసిన బాలికతో ప్రేమ వ్యవహారం .. మైనర్ ఇంటికి వెళ్లిన యువకుడు

హత్యకు దారి తీసిన బాలికతో ప్రేమ వ్యవహారం .. మైనర్ ఇంటికి వెళ్లిన యువకుడు
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన కుటుంబసభ్యులు
  • పది మంది దారుణంగా కొట్టడంతో యువకుడి మృతి
  • మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో ఘటన

ఘట్ కేసర్, వెలుగు : బాలికతో ప్రేమ వ్యవహారం యువకుడి హత్యకు దారి తీసింది. బాలిక కుటుంబసభ్యులు యువకుడిని దారుణంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారంలోని ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్​కు చెందిన ధరావత్ సుశీల కొడుకు ధరావత్ కరణ్​(18)తో కలిసి 15 ఏండ్ల కిందట సిటీకి వచ్చి పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని లక్ష్మినర్సింహా కాలనీలో రెంట్​కు ఉంటోంది.

సుశీల కూలి పని చేస్తోంది. కరణ్​ తన ఇంటికి సమీపంలో ఉండే ఓ బాలిక(15) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. బుధవారం రాత్రి కరణ్ బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమెతో కలిసి కరణ్ ఓ రూమ్​లో ఉండగా.. బాలిక కుటుంబసభ్యులు అతడిని పట్టుకున్నారు. 10 మంది కుటుంబసభ్యులు కరణ్​ను కర్రలతో చితకబాదారు. ప్రైవేటు పార్ట్స్​పై కారం చల్లి 3 గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. మరోసారి బాలిక జోలికి రావొద్దని హెచ్చరించి వదిలేశారు. తీవ్రంగా గాయపడ్డ కరణ్ అలాగే ఇంటికి చేరుకున్నాడు.

ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తల్లి సుశీల  అతడిని హాస్పిటల్​కు తీసుకెళ్లగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. సుశీల ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు..  కరణ్​పై దాడికి పాల్పడ్డ  బాలిక కుటుంబసభ్యులు శింగాడే దోండియా (45), రాధాబాయి (34),  సురేష్ (30), సుధీర్ (20), మాధవ్ (30),    కందు(45),  జల్బా (32), గజానంద్ (27) తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి డెడ్ బాడీని గాంధీకి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్, ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు.