చనిపోయిన వ్యక్తికి సీరియస్​ అంటూ రెఫర్

చనిపోయిన వ్యక్తికి సీరియస్​ అంటూ రెఫర్
  • సర్జరీ చేసిన డాక్టర్ల తీరుపై కుటుంబసభ్యుల అనుమానం
  • భద్రాద్రి జిల్లా చుంచుపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళన  

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: చనిపోయిన వ్యక్తికి సీరియస్​గా ఉందంటూ డాక్టర్లు హడావుడి చేసి వేరే ఆస్పత్రికి రెఫర్ చేసిన ఘటన  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని వత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన రైతు ప్రత్తిపాటి కోటేశ్వరరావు(54) వెన్నెముక నొప్పితో బాధపడుతూ ఈనెల 2న చుంచుపల్లి మండలం విద్యానగర్​ కాలనీలోని పీఎం బ్రదర్స్ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు.  గతంలో అక్కడ కోటేశ్వరరావు బంధువు చికిత్స చేయించుకోగా నయం కావడంతో ఆ నమ్మకంతో వెళ్లాడు. 

కోటేశ్వరరావుకు టెస్టులు చేసిన అనంతరం  వెన్నెముక సర్జరీకి కొంత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. కాగా.. శుక్రవారం రాత్రి10.30 గంటలకు ఆయనకు  సర్జరీ చేస్తామని చెప్పి.. అర్ధరాత్రి  ఆపరేషన్​ థియేటర్ లోకి తీసుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో డాక్టర్లు హడావుడి చేస్తూ పేషెంట్ కండీషన్ సీరియస్ గా ఉందని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని అంబులెన్స్ పిలిచి పంపించారు. దీంతో  కోటేశ్వరరావు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.  అనంతరం ఖమ్మంలోని శ్రీరక్ష ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా కోటేశ్వరరావును డాక్టర్లు పరిశీలించి..  అతను చనిపోయి  రెండు మూడు గంటలు అయిందంటూ   చెప్పారు.

అప్పటికే.. ​కోటేశ్వరరావును తీసుకొచ్చిన అంబులెన్స్ ​డ్రైవర్​తో పాటు కంపౌండర్ చెప్పకుండా  వెళ్లిపోయారు.   మరో అంబులెన్స్​ మాట్లాడుకుని డెడ్ బాడీని  చుంచుపల్లిలోని పీఎం బ్రదర్స్ ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లారు. దీంతో ముందుగానే మేనేజ్​మెంట్​అప్రమత్తమై  పోలీసులకు సమాచారం ఇచ్చింది.  చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి  ఎస్ఐలు  వెళ్లి ఆస్పత్రివద్ద ధర్నా చేయొద్దంటూ  హెచ్చరించారు. అంతేకాకుండా డెడ్ బాడీని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని బాధిత కుటుంబ సభ్యులపై  ఒత్తిడి చేశారు. డాక్టర్లు వచ్చి స్పష్టత ఇచ్చేవరకు  వెళ్లమంటూ ఆందోళనకు దిగడంతో  కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కొడుకు ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎస్ఐ రవి మాట్లాడుతూ..  పీఎం బ్రదర్స్​ ఆస్పత్రిలో   కోటేశ్వరరావుకు సీరియస్​గా ఉందని  డాక్టర్లు చెప్పడంతో  కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఆస్పత్రికి  తరలించారని తెలిపారు. మార్గమధ్యలో చనిపోయినట్టుగా మృతుడి కొడుకు  ఫిర్యాదు చేశారని చెప్పారు. పేషెంట్ కండీషన్  సీరియస్​గా ఉండడంతోనే ఖమ్మం రెఫర్​  చేశామని పీఎం బ్రదర్స్ ఆస్పత్రి మేనేజ్​మెంట్ తెలిపింది.