
- బ్యాంకుల వద్ద రైతులతో కలిసిపోయి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
- జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 34 మందిపై చీటింగ్ కేసు
ఆదిలాబాద్, వెలుగు: బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న పంట రుణాన్ని కట్టి, తిరిగి కొత్త రుణాన్ని రైతులకు ఇప్పించి డబ్బులు వసూలు చేస్తున్న దళారులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ప్రతి ఏడాది బ్యాంకులు రైతుకు రుణాలు ఇస్తుంది, ఆ రుణానికి ఏడు శాతం వడ్డీ ఉండగా, గడువులోగా చెల్లిస్తే మూడు శాతం బోనస్ తిరిగి వస్తుంది. అంతేకాకుండా బ్యాంకు కొత్త రుణాలను 20 నుంచి 30 శాతం వరకు పెంచి ఇస్తుండడంతో ఇదే అదనుగా భావించిన దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
రైతులు తీసుకున్న రుణాలను వారే వడ్డీతో సహా కట్టేసి, తిరిగి రైతులకు అధిక రుణాన్ని ఇప్పించడానికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. ఈ తరహా మోసాన్ని గ్రహించిన పోలీసులు బుధవారం జిల్లా వ్యాప్తంగా 16 పోలీసు బృందాలు 9 మండలాల్లో ఏకకాలంలో రైతుల వేషధారణలో బ్యాంకుల వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న దళారులు పోలీసులతో బేరసారాలు చేయడం, రైతు రుణమాఫీ తామే కట్టి ఎక్కువ రుణాన్ని ఇప్పిస్తామని, వచ్చిన దానిలో తమకు వాటా ఇవ్వాలంటూ చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇలా మోసం చేస్తున్న 34 మంది దళారులను రెడ్ హ్యాండెడ్ పట్టుకుని, చీటింగ్ కేసు నమోదు చేసి వారి నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
చీటింగ్ కేసు నమోదైన 34 మంది..
గుడిహత్నూర్ మండలానికి చెందిన జయ బాయి శంకర్, అడే జైపాల్, తిక్డే సాగర్, గుగ్గే రాందాస్, ముండే రాందాస్, సాంబేట కరుణాకర్, ఖండార్కర్ రమేశ్, కతురే భారత్, జాదవ్ దినేశ్, ఉట్నూరు మండలంలోని జాదవ్ హరి, కుమ్ర దౌలత్ రావు, అర్సుల్వాద్ భీమ్ రామ్, రాథోడ్ గబ్బర్ సింగ్, జాదవ్ తానాజీ, నార్నూర్ మండలంలోని జాదవ్ రాహుల్, జాదవ్ భిక్షపతి, రాథోడ్ అనిల్, జాదవ్ నీలేశ్, జాదవ్ విజయ్ కుమార్, రాథోడ్ సురేశ్, రాథోడ్ దుదిరం, రాథోడ్ యశ్వంతరావు, రాథోడ్ కార్తీక్ కుమార్, రాథోడ్ రాజేశ్, రాథోడ్ గణేశ్, బేల మండలంలోని మహమ్మద్ అయూబ్, సిర్పూర్ కార్ సంజీవ్, మురాడి సురేశ్, భీంపూర్ మండలంలోని కుమ్రపు అశోక్, రెడ్డివారి దేవన్న, మావల మండలం చక్రం దేవరావు, ఇంద్రవెల్లి మండలంలోని నార్వాటి రాము, కొముర రామ్ షావ్, ఫారూఖ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.