- ట్రాన్స్కో, జెన్కో, ఉత్తర, దక్షిణ డిస్కమ్ ల ఉద్యోగులకు అవకాశం
- నేటి నుంచి 8 వరకు దరఖాస్తుల స్వీకరణ
- 13న అపాయింట్మెంట్ లెటర్ల జారీ
- 25 నాటికి జాయినింగ్కు అవకాశం
- గైడ్ లైన్స్ జారీ చేసిన సీఎండీ ముషారఫ్ అలీ ఫారుఖీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్లో చేరే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనున్నట్టు గురువారం ఆ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారుఖీ తెలిపారు. ట్రాన్స్కో, జెన్కో, ఉత్తర, దక్షిణ డిస్కమ్ లలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు దరఖాస్తు చేసుకునేందుకు గైడ్ లైన్స్ ఇచ్చారు. శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. 13న అర్హులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని తెలిపారు. రిపోర్టింగ్ కు 3 రోజులు గడువు ఇస్తామని, 19న పోస్టింగ్ ఆర్డర్స్ జారీ చేస్తామని పేర్కొన్నారు. 25 వరకు విధుల్లో చేరడానికి గడువు ఉంటుందని ప్రకటించారు.
ఎస్ఈ నుంచి సీఈ.. డీఈ నుంచి ఎస్ఈకి పదోన్నతి
రైతు డిస్కమ్లో పనిచేయడానికి ఒక ఏడాది అనుభవం ఉన్న ఎస్ఈకి సీఈగా, రెండేండ్ల అనుభవం ఉన్న డీఈకి ఎస్ఈగా పదోన్నతి కల్పించి విధుల్లోకి తీసుకుంటామని సీఎండీ తెలిపారు. ఏడీఈకి డీఈగా, ఏఈ, అడిషనల్ ఏఈలకు ఏడీఈలుగా, సబ్ఇంజినీర్లకు ఏఈ, అడిషనల్ ఏఈలుగా, అర్హత కలిగిన ఫోర్మేన్లకు సబ్ ఇంజినీర్లుగా ప్రమోషన్ ఇస్తామని చెప్పారు. సివిల్విభాగంలో అనుభవం కలిగిన ఈఈలకు ఎస్ఈలుగా, ఏఈఈలకు ఈఈలుగా, ఏఈలకు ఏఈఈలుగా పదోన్నతి కల్పిస్తామన్నారు.
అలాగే, అకౌంట్స్విభాగంలో జనరల్ మేనేజర్లకు చీఫ్ జనరల్మేనేజర్లుగా, సీనియర్ అకౌంట్స్ఆఫీసర్లకు జనరల్ మేనేజర్లుగా, అకౌంట్స్ ఆఫీసర్లకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా ప్రమోషన్లు ఇస్తామని అన్నారు. వీరితో పాటు ఆపరేషన్ అండ్ మేయింటనెన్స్ విభాగంలో కూడా పదోన్నతులు ఉంటాయన్నారు. గ్రేడ్ 1, 2, 3, 4 క్యాడర్ ఆర్టిజన్లకు ఒక అడిషనల్ ఇక్రిమెంట్ఇస్తామన్నారు. అది కూడా తొలిదశలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రమోషన్లు ఇస్తామన్నారు. ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్ నియమాలు వర్తింపజేస్తామని చెప్పారు.
ఏసీబీ, క్రిమినల్ కేసులున్న వారికి అర్హత లేదు
రైతు డిస్కమ్లో చేరడానికి అప్లయ్ చేసుకునే ఉద్యోగులు ఏసీబీ, ఇతర క్రిమినల్, డిసిప్లినరీ కేసులలో ఇన్వాల్వ్ అయి ఉండకూదని సీఎండీ తెలిపారు. ఈ విషయమై దరఖాస్తు చేసుకునే ఉద్యోగి తప్పనిసరిగా తనపై ఎలాంటి క్రిమినల్, ఇతర కేసులు లేవని స్వయంగా రాసి ఇవ్వాలన్నారు. బదిలీ ద్వారా పదోన్నతులు పొందిన వారు కనీసం ఐదేండ్ల పాటు రైతు డిస్కమ్లో పనిచేయవలసి ఉంటుందన్నారు. వీరికి ఐదేండ్ల దాకా స్వచ్ఛంద పదవీ విరమణ చేసే అవకాశం, ఇతర సంస్థలకు డిప్యూటేషన్పై వెళ్లే చాన్స్ ఉండదని తెలిపారు.
దరఖాస్తు ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే పంపించాలన్నారు. దరఖాస్తు చేసిన వారిలో ఎవరిని సెలక్ట్ చేసుకోలి.. సెలక్ట్ అయిన వారికి క్యాడర్ను బట్టి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి.. అనే అధికారం రైతు డిస్కం యాజమాన్యానికే ఉంటుందన్నారు. జీతం, సర్వీస్ నిబంధనలు, ఈపీఎఫ్, జీపీఎఫ్ మాతృసంస్థలో మాదిరిగానే ఉంటాయని వివరించారు.
