కరెంట్ షాక్​తో ఇద్దరు మృతి

కరెంట్ షాక్​తో ఇద్దరు మృతి

వీపనగండ్ల, వెలుగు:  వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్​తో వేమన్న (55) అనే రైతు చనిపోయాడు. తన పొలంలోని  కోళ్ల ఫారం షెడ్​లో కరెంట్ సప్లై లేకపోవడంతో రిపేర్​ చేస్తుండగా కరెంట్​షాక్​వచ్చి స్పాట్​లోనే మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.  భార్య గంగమ్మ ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్​కానిస్టేబుల్  మునీశ్వర్​రెడ్డి తెలిపారు. 

ములుగు మండలంలో హెల్పర్​.. 

ములుగు, వెలుగు :  ములుగు మండలం దేవనగర్​ శివారులో బుధవారం సాయంత్రం ట్రాన్స్​ఫార్మర్​ లో సమస్య తలెత్తడంతో రిపేర్​ చేస్తున్న హెల్పర్​ కరెంట్​ షాక్​తో  చనిపోయాడు.  మండలంలోని శ్రీనగర్​ గ్రామానికి చెందిన నల్ల కృష్ణ (35) మల్లంపల్లి సెక్షన్​ లో హెల్పర్​ (అన్​మ్యాన్​ వర్కర్​) గా డ్యూటీ చేస్తున్నాడు. ఓ రైతు దేవనగర్​ శివారులోని పంట పొలాల వద్ద ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ రిపేర్​ ఉండడంతో కృష్ణను పిలిపించుకున్నాడు. అయితే కృష్ణ ట్రాన్స్ ఫార్మర్​ ఎక్కగానే ఎల్టీ లైన్​లో కరెంట్​ సరఫరా అయ్యి అక్కడికక్కడే మృతిచెందాడు. ఎల్​సీ తీసుకున్నా కూడా కరెంట్​ షాక్​ రావడమేంటని ఆఫీసర్లు ఆరా తీయగా మరో బ్యాక్​ లైన్​ నుంచి సదరు రైతు మోటారుకు కరెంట్​ తీసుకోవడమే కారణమని,  దీంతోనే కృష్ణ చనిపోయినట్లు విద్యుత్ సిబ్బంది చెప్తున్నారు. ఈవిషయంపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.