
- తహసీల్దార్ ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకున్న బాధితుడు
- రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఘటన
శంషాబాద్, వెలుగు : ధరణిలో తన భూమిని తొలగించారంటూ ఓ రైతు శంషాబాద్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని శంకరాపూర్ గ్రామానికి చెందిన చెన్నకేశవ, కమలమ్మ, లక్ష్మయ్య పేరిట ఘన్సీమియాగూడా రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్4/7 4/8లో 8 ఎకరాల భూమి ఉంది. దీన్ని కొంతకాలం కింద ధరణి నుంచి తొలగించారు. దీంతో అధికారులకు ఫిర్యాదు చేసి 9 నెలల నుంచి వారి చుట్టూ తిరుగుతున్నారు.
అయినా పట్టించుకోకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబసభ్యులంతా కలిసి శంషాబాద్తహసీల్దార్ఆఫీసుసకు వచ్చారు. ఇందులో కమలమ్మ కొడుకు సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకోగా, అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్అడ్డుకొని అదుపులోకి తీసుకున్నాడు. సూరిబాబు మాట్లాడుతూ ధరణిలో తమ పేరు మీదున్న పొలాన్ని తొలగించారని, ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
రేపు..మాపు అంటూ తిప్పించుకుంటున్నారని, అందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పాడు. దీనిపై తహసీల్దార్ నాగమణిని వివరణ కోరగా వారు దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమేనని, అది ప్రాసెసింగ్లో ఉందన్నారు.