ధరణిలో భూమిని తొలగించారని రైతు ఆత్మహత్యాయత్నం

ధరణిలో భూమిని తొలగించారని రైతు ఆత్మహత్యాయత్నం
  • తహసీల్దార్​ ఆఫీసు ముందు పెట్రోల్ ​పోసుకున్న బాధితుడు
  • రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో ఘటన 

శంషాబాద్, వెలుగు : ధరణిలో తన భూమిని తొలగించారంటూ ఓ రైతు శంషాబాద్ తహసీల్దార్ ​ఆఫీసు ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని శంకరాపూర్ గ్రామానికి చెందిన చెన్నకేశవ, కమలమ్మ, లక్ష్మయ్య పేరిట ఘన్సీమియాగూడా రెవెన్యూ పరిధిలోని  సర్వే నంబర్​4/7 4/8లో 8 ఎకరాల భూమి ఉంది. దీన్ని కొంతకాలం కింద ధరణి నుంచి తొలగించారు. దీంతో అధికారులకు ఫిర్యాదు చేసి 9 నెలల నుంచి వారి చుట్టూ తిరుగుతున్నారు.

అయినా పట్టించుకోకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబసభ్యులంతా కలిసి శంషాబాద్​తహసీల్దార్​ఆఫీసుసకు వచ్చారు. ఇందులో కమలమ్మ కొడుకు సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకోగా, అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్​అడ్డుకొని అదుపులోకి తీసుకున్నాడు. సూరిబాబు మాట్లాడుతూ ధరణిలో తమ పేరు మీదున్న పొలాన్ని తొలగించారని, ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

రేపు..మాపు అంటూ తిప్పించుకుంటున్నారని, అందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పాడు. దీనిపై తహసీల్దార్ ​నాగమణిని వివరణ కోరగా వారు దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమేనని, అది ప్రాసెసింగ్​లో ఉందన్నారు.