డప్పులు కొట్టి.. డీజేలు పెట్టి: రైతులు పడరాని పాట్లు

డప్పులు కొట్టి.. డీజేలు పెట్టి: రైతులు పడరాని పాట్లు

మిడతల దెబ్బకు పంట నష్టం
3.6 లక్షల హెక్టార్లు రాజస్థాన్​లోని 10 జిల్లాల్లో ఎఫెక్ట్

రాజస్థాన్​లో పోయినేడాది మేలో ప్రారంభమైన మిడతల దాడి ఇప్పటికీ కొనసాగుతోంది. పశ్చిమ రాజస్థాన్​లోని 10 జిల్లాల్లో వీటి ప్రభావం ఉంది. ఇవి ఇప్పటి వరకు 3.6 లక్షల హెక్టార్లలోని పంటను నాశనం చేశాయి. ఒక్క శ్రీగంగానగర్ జిల్లాలోనే  లక్ష హెక్టార్లలో పంట నాశనమవ్వగా, మిగతా 9 జిల్లాల్లో 2.6 లక్షల హెక్టార్లలో ధ్వంసమైంది. గత 60 ఏళ్లలో ఇదే అతిపెద్ద మిడతల దాడి అని అధికారులు, రైతులు తెలిపారు. శ్రీగంగానగర్ జిల్లాలో దాదాపు 75శాతం పంటను మిడతలే తిన్నాయని చెప్పారు. హనుమాన్​గఢ్, బికనీర్, జైసల్మేర్, జోధ్​పూర్, జాలోర్, సిరోహి, నాగౌర్, చురూ​జిల్లాల్లోనూ ఇవి పంటలపై దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఆఫీసర్లు పంట నష్టంపై ఎలాంటి లెక్కలు తీసుకోవడం లేదని, మిడతల నివారణకు చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మిడతలు దక్షిణ పాకిస్థాన్ ​నుంచి వస్తున్నాయని అధికారులు, రైతులు పేర్కొంటున్నారు. తొలిసారి పోయినేడాది మేలో లక్షల్లో వచ్చిన మిడతలు ఖరీఫ్​(జూలై–సెప్టెంబర్) పంటను నాశనం చేశాయి. మళ్లీ ఇప్పుడు రబీ (అక్టోబర్‌‌–మార్చి) పంటలపై దాడి చేస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున మిడతలు దాడి చేసిన దాఖలాలు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మిడతలను నివారించేందుకు అధికారులు పెస్టిసైడ్స్​స్ర్పే చేస్తున్నారు. అయినా అవి కంట్రోల్ కావడం లేదు. పాకిస్థాన్​లో వీటి బ్రీడింగ్​ఎక్కువగా ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్​తో చర్చించాలి” అని కిసాన్​ సంఘర్షణ సమితి సభ్యుడు సుభాష్​ షెగాల్​కోరారు. ఈ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశామన్నారు.  ఒక్కో ఎకరాకు 20,000 పరిహారం ఇవ్వాలని కోరామన్నారు.

డప్పులు కొట్టి.. డీజేలు పెట్టి..

మిడతల బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అధిక శబ్దాలతో వాటిని బెదరగొట్టేందుకు డప్పులు కొట్టడంతో పాటు డీజే మ్యూజిక్​కూడా పెడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇదే పనిలో నిమగ్నమవుతున్నారు. రాజస్థాన్​లో అసలే వాటర్​సోర్స్​తక్కువ. ఉన్న కొద్దిపాటి వనరులతో పంటలను పండించుకుంటే మిడతలు ఇలా దాడి చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘పంట వేసేందుకు బ్యాంకులో రూ.3లక్షల లోన్​ తీసుకున్నాను. ఇప్పుడు నా పంటనంతా మిడతలు తినేస్తే నేను లోన్​ఎలా తీర్చాలి?” అని మహమూద్​నూర్​ అనే రైతు కన్నీటి పర్యంతమయ్యారు.

see also: కల్మషం లేని మనసులు: చిన్న వయసులో పెద్ద ఆలోచన