సిద్దిపేట రూరల్, వెలుగు: మల్లన్న సాగర్ కెనాల్ నుంచి వెంటనే నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, వెంకట్రావుపల్లి, బదనకల్ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి, చింతమడక గ్రామాల సరిహద్దు వద్ద ముస్తాబాద్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా, పోలీసులు జోక్యం చేసుకుని రైతులను సముదాయించి అక్కడి నుంచి పంపించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాగునీటిని విడుదల చేయాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోకపోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు సాగునీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు.
