ఇచ్చిన మాట ప్రకారం తన సొంత భూమిని తెలంగాణ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. నవంబర్ 6న ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేశారు.
రెండు నెలల క్రితమే కోదండరెడ్డి తన సొంత గ్రామం ఐనా యాచారం గ్రామంలోని 4 కోట్ల విలువ చేసే 2 వేల గజాల స్థలాన్ని, అందులో ఉన్న భవనాన్ని వ్యవసాయశాఖకు రాసివ్వనున్నట్లు ప్రకటించారు. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిల్వ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిమొట్లు పెట్టుకోడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇక శాశ్వతంగా రైతులకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటదనే ఆలోచనతో కోదండరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గతంలోనే ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి వివరించారు. ఐతే దానికి సంబందించిన అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ ముగిసింది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ హర్షన్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ తరుపున రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, ఏడీఏ సుజాత, ఏవో రవినాధ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఈ స్థలాన్ని రైతులు వ్యవసాయ సామాగ్రి, ధాన్యం కొనుగోలు కేంద్రం, సీజన్ పంటలు నిలువ చేసుకోవడానికి ఉపయోగించాలని సూచించారు. ఈ నిర్ణయం రైతుల సౌకర్యార్థం తీసుకున్నానని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని అనేక మందికి ఆదర్శప్రాయామని కొనియాడుతున్నారు. కోట్ల విలువు చేసే భూమిని ప్రభుత్వానికి అప్పగించడంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు
