పండ్ల తోట పాడవుతోందని.. కాలువ పూడ్చివేత

పండ్ల తోట పాడవుతోందని.. కాలువ పూడ్చివేత

పెబ్బేరు, వెలుగు: పండ్ల తోట పాడవుతోందని తోట యజమాని జూరాల ఫీల్డ్​ కెనాల్​ను పూడ్చి వేయడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని సుగూర్  గ్రామం పరిధిలోని రామేశ్వరాపూర్  శివారులో 12 ఏండ్లుగా జూరాల ఫీల్డ్​ కెనాల్  ఉంది. గ్రామానికి చెందిన రైతు సయ్యద్  ఆరిఫుద్దీన్  అలియాస్  ముజాకర్  తాను కొత్తగా పెట్టిన పండ్ల తోట పాడవుతోందని ఇటీవల జూరాల ఫీల్డ్​ కెనాల్​ను పూడ్చి వేశాడు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. ఈ విషయాన్ని పీజేపీ డీఈ భావన దృష్టికి తీసుకెళ్లగా, ఎంక్వైరీ చేయాలని పెబ్బేరు ఏఈ మతీన్ ను ఆదేశించారు. 

కాలువను పరిశీలించిన ఏఈ, వర్క్ ఇన్స్​పెక్టర్​ కాలువ పూడ్చిన రైతుకు మద్దతు తెలిపారు. కాలువ పూడ్చిన రైతుతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి వెళ్లి పోయారని సూగూరు గ్రామ రైతులు చాకలి జయరాములు, మద్దిలేటి, ఎల్లయ్య, మన్నెమ్మ, బాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలంలో నుంచి పైప్​ లైన్ వేసుకోవాలని, పండ్ల తోటలో మొక్కలు దెబ్బతింటే పరిహారం ఇస్తామని బాండ్ పేపర్ పై రాసిస్తేనే కాలువ తీసేందుకు ఒప్పుకుంటానని చెబుతున్నాడని వాపోయారు. పెబ్బేరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ విషయమై ఇరిగేషన్​ ఎస్ఈ సత్యశీలారెడ్డిని ఫోన్​లో వివరణ కోరగా, రైతులు రాత పూర్వకంగా కంప్లైంట్​ ఇస్తే చర్యలు తీసుకుంటానని చెప్పారు.