అంతరాలు లేని సమాజమే కమ్యూనిస్టుల లక్ష్యం..వనపర్తిలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుల శిక్షణ తరగతులు

అంతరాలు లేని సమాజమే కమ్యూనిస్టుల లక్ష్యం..వనపర్తిలో  సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుల శిక్షణ తరగతులు
  • సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి

వనపర్తి, వెలుగు : అంతరాలు లేని సమాజమే కమ్యూనిస్టుల లక్ష్యమని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వనపర్తిలో ప్రారంభమైన సీపీఐ ఉమ్మడి జిల్లా కార్యవర్గసభ్యుల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాలు నరమేధానికి పాల్పడుతున్నాయన్నారు. 

స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం అలీన విధానంతో ముందుకు సాగిందని, కానీ యుద్ధం పట్ల ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు భారత పరువును తీసిందన్నారు. రాముని పేరుతో అధికారం చేజిక్కించుకొని, మత రాజకీయాలు నడుపుతూ ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలను నెరవేర్చడం లేదన్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో రాజకీయ జోక్యం పెరిగిందని, అర్హులైన వారికి ఇండ్లు రావడం లేదన్నారు. భూదాన్ భూముల్లో పేదలు ఇండ్లు కట్టుకుంటే.. నిర్ధాక్షిణ్యంగా కూలగొట్టి, వారిని రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు, ప్రాజెక్టుల పూర్తికి సీపీఐ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు ఎండీ ఫయాజ్, విజయరాములు, బాలకిషన్, బి. ఆంజనేయులు, నాయకులు కేశవులు గౌడ్, రమేశ్, కళావతమ్మ, నరసింహ పాల్గొన్నారు.