- గతంలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన సర్కారు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్లో సుమారు 100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిలో హైడ్రా శుక్రవారం ఆక్రమణలు తొలగించింది. సర్వే నంబరు 25/2లో 38.15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. హెచ్ఎండీ ఏ ఆధీనంలో ఉన్న ఈ భూమిని జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి కేటాయించారు.
ఆ స్థలం కబ్జాల పాలవకుండా గతంలో 36.25 ఎకరాల మేర హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అక్కడ సెయింట్ ఆన్స్ హైస్కూల్ నిర్వాహకులు 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని వారి స్వాధీనంలో ఉంచుకుని క్రీడామైదానంగా వినియోగిస్తున్నారు. అప్పట్లో విద్యాసంవత్సరం పూర్తయ్యేంతవరకు సమయం ఇవ్వాలని స్కూల్ నిర్వాహకులు కోరారు. విద్యా సంవత్సరం పూర్తయ్యాక కూడా ఆ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని తొలగించకపోవడంతో హైడ్రా శుక్రవారం చర్యలు తీసుకుంది. ప్రహరీని తొలగించి ప్రభుత్వ భూమి ఉన్న మేర ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.
