కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 23వ డివిజన్ బాలాజీ నగర్లో మున్సిపల్ జనరల్ ఫండ్(ఎంజీఎఫ్) రూ.23 లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు అధికారులు టెండర్ నోటీఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్లో నోడ్ పాయింట్లు(ఒక ఇంటి నంబర్ మరో ఇంటి నంబర్ వరకు అనే వివరాలు) లేవు. శకుంతల ఇంటిం నుంచి ప్రభాకర్ ఇంటి వరకు రోడ్డు, డ్రెయిన్ వేస్తున్నట్లు మాత్రమే పేర్కొన్నారు. ఆ డివిజన్ లో అన్ని ఇండ్లకు ఇంటి నంబర్లు ఉండగా ఇలా పేర్లు పేర్కొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- నోడ్ పాయింట్లు లేకుండానే పనులు
- ఏ ఇంటి నంబర్ నుంచి ఏ ఇంటి నంబర్ వరకు రోడ్డు వేస్తున్నారనే అంశం నోటిఫికేషన్ లో పేర్కొనని అధికారులు
- కరీంనగర్ కార్పొరేషన్లో ఆఫీసర్ల ఇష్టారాజ్యం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ జనరల్ ఫండ్స్(ఎంజీఎఫ్), సుడా నిధులు, స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్(ఎస్ డీఎఫ్) తదితర నిధులతోచేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయినేజీ, ఇతర అభివృద్ధి పనుల టెండర్ నోటిఫికేషన్లలో అధికారులు నోడ్ పాయింట్లు(ఇంటి నంబర్లు) పేర్కొనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్లను గందరగోళానికి గురిచేసి ఎక్కువ సంఖ్యలో టెండర్లు వేయకుండ ఉండడం కోసం ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇంటి నంబర్లు లేకుండా ఇలా నోటిఫికేషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డూప్లికేషన్ కు అవకాశం
మున్సిపల్ కార్పొరేషన్లో ఇంటి నంబర్లు మారడానికి వీలుండదు. కానీ ఇంటి ఓనర్ షిప్ మాత్రం మారే అకాశముంటుంది. అందువల్ల ఇంటి నంబర్లను మాత్రమే ప్రాతిపదిక తీసుకుని టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వ్యక్తుల పేర్లను నోడ్ పాయింట్లుగా పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోడ్ పాయింట్ గా చూపిన వ్యక్తి పేరిట ఒకే కాలనీలో రెండు ఇండ్లు ఉంటే.. ఏ ఇంటిని ప్రాతిపదిక తీసుకోవాలని, ఈ స్పష్టత లేకపోతే కాంట్రాక్టర్ కు, బల్దియాకు మధ్య వివాదాలు తలెత్తే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్నలో్ ఎక్కడ వర్క్ జరిగినా.. ఆ పనికి సంబంధించిన నిధులు, పని వివరాలు తెలిపే బోర్డును ప్రదర్శించాలనే నిబంధన ఉన్నా అమలు చేయడం లేదు.
ఒకే పనికి రెండు రకాల ఫండ్స్ తో అనుమతులు
మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో జనరల్ ఫండ్ కింద టెండర్ పిలిచిన పనులనే, మళ్లీ యూఐడీఎఫ్ కింద మరోసారి టెండర్ పిలవడంపై ఇటీవల విమర్శలు వచ్చాయి. మార్కండేయనగర్లోని ఇంటి నెం.9-5-333 నుంచి 9-5-323, 323/ఏ వద్ద రూ.15.20 లక్షల (జీఎస్టీతో కలిపి) మున్సిపల్సాధారణ నిధులతో టెండరు పిలిచారు. మళ్లీ ఇదే పనిని 2026 ఏప్రిల్లో రెండు బిట్లుగా చేసి ఒకటి రూ.4.95 లక్షలు, మరొకటి రూ.4.90 లక్షలతో టెండర్లు పిలిచారు. ఒకే పనికి రెండు సార్లు టెండర్ పిలిచారని ఫిర్యాదు అందడంతో బల్దియా స్పందించింది.
మొదటి పనికి సంబంధించి తాము టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాలేదని, నాలుగో రీకాల్లో వీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఏజెన్సీ పాల్గొన్నా.. ఫైనాన్సియల్ బిడ్ ఓపెన్ చేయకపోవడంతో బిడ్ వాలిడిటీ సమయం ముగిసిందని, దీంతో వర్క్ ఎవరికీ అప్పగించలేదని కార్పొరేషన్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇదే పనికి అధికారులు తాజాగా మూడోసారి అర్బన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫండ్(యూఐ డీఎఫ్) పథకం కింద రూ.25 లక్షల నిధులతో టెండర్లు పిలవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే పనిని రెండు నెలల కాలంలో వేర్వేరు ఫండ్స్ కింద చేపట్టేందుకు టెక్ని కల్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడంపై అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి.
