హైదరాబాద్, వెలుగు: యూరియాపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అగ్రికల్చర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జానయ్య పేర్కొన్నారు. యూరియా కొరతపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దని సూచించారు. పదిహేను ఏళ్లుగా ఇతర ఎరువులతో పోలిస్తే యూరియా తక్కువ ధరకే లభ్యమవుతుండడంతో రైతులు అధికంగా వినియోగిస్తున్నారని తెలిపారు.
దీనివల్ల దిగుబడిలో పెద్ద మార్పు లేకపోయినా, నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. గల్ఫ్ యుద్ధ ప్రభావంతో యూరియా సరఫరా తగ్గినా రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మార్కెట్లో నానో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందన్నారు. సాధారణ యూరియాతో వచ్చే ఫలితాలే నానో యూరియాతో సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
