రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రోడ్డున పడేశారు

రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రోడ్డున పడేశారు
  • వనపర్తి లో రైతులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన
     

వనపర్తి: రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రోడ్డున పడేశారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యమంతా మద్దతు ధరతో కొనాలంటూ మంగళవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. పండిన ధాన్యం మద్దతు ధరతో కొనే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు ప్రకటించారు. 
వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు దగ్గర నిర్వహించిన అఖిలపక్ష నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం, వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎంతోపాటు తెలంగాణ జనసమితి, న్యూ డెమాక్రసీ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

టి.డి.పి నుంచి బి.రాములు, నందిమల్ల.అశోక్, సీపీఎం నుంచి జబ్బార్, ఆంజనేయులు, న్యూ డెమొక్రసి నుంచి అరుణ్ కుమార్, రాజన్న, తెలంగాణ జనసమితి (టి.జె.ఎస్) నుంచి ఖాదర్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ధాన్యం కొనాగోలు విషయములో రైతులను రోడ్డున పడేశారని విమర్శించారు. దేశానికి తెలంగాణను రైస్ బోల్ చేస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ తోక ముడిచారని, 17 శాతం తేమ కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. మార్కెట్లలో మాత్రం 13 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయడం లేదని వారు విమర్శించారు. వర్షాకాలం పంటను కొనకుండా యాసంగి గూర్చి ధర్నా చేయడం విడ్డురంగా ఉందని అన్నారు.

ధాన్యాన్ని మద్దతు ధరతో సహా కొనుగోలు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టి.డి.పి నాయకులు సయ్యద్ జమీల్, నందిమల్ల రమేష్, దస్తగిరి, ఆవుల శ్రీను, చిన్నయ్య, నాగన్న, వహీద్,  బాలయ్య, డి.బాలరాజు, వాకిటి.నారాయణ, గోవిందు, సీపీఎం నుండి పరమేశ్వరాచారి, రమేష్, లక్మి, ఉమ, న్యూ డెమొక్రసి నుండి రాజన్న, గణేష్, రాజు, టి.జె.ఎస్ నుండి శివ తదితరులు పాల్గొన్నారు.