
ఫార్మింగ్టన్ యూనివర్సిటీ వ్యవహారానికి సంబంధించి తామే తప్పూ చేయలేదని తెలుగు విద్యార్థులు అమెరికా కోర్టుకు వివరించారు. స్టింగ్ ఆపరేషన్ పేరిట ట్రాప్ చేశారని ఆరోపించారు. పోలీసులు ఈ కేసులో అరెస్టు చేసిన ఎనిమిది మంది తెలుగువారు ఫణిదీప్ కర్నాటి, భరత్ కాకిరెడ్డి, సురేశ్ కందాల, ప్రేమ్ రాంపీసా, సంతోష్ సామ, అవినాశ్ తక్కళ్లపల్లి, అశ్వంత్ నూనె, నవీన్ పత్తిపాటిలను మంగళవారం అమెరికాలోని మిషిగన్ కోర్టులో ప్రవేశపెట్టారు. తర్వాత ఈ ఎనిమిది మంది తరఫు అటార్నీలు (న్యాయవాదులు) విచారణకు హాజరై వాదనలు వినిపించారు. వీరిలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఫణిదీప్ కర్నాటికి మాత్రం బెయిల్ లభించింది. మిగతావారిని డిటెన్షన్ సెంటర్ కు తరలించారు.
నేరం రుజువైతే ఐదేళ్ల జైలు
అమెరికాలో అక్రమంగా ఉంటూ, ఉద్యోగాలు చేసుకోవాలనుకునే వారిని పట్టుకునేందుకు అక్కడి పోలీసులు, ఇమిగ్రేషన్ అధికారులు ‘యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ ’పేరిట ఉత్తుత్తి వర్సిటీని పెట్టిన విషయం తెలిసిందే. అందులో ఏదో కోర్సులో చేరినవారు క్లాసులకు హాజరుకాకుండా.. బయట ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఇది నిజమని నమ్మి తెలుగువారు సహా వందలాది మంది భారతీయ విద్యార్థులు ఆవర్సిటీలో చేరారు. బయట ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ విద్యార్థులను చేర్చేందుకు కొందరు తెలుగువారు మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఏడాదిన్నర పాటు ఈ వ్యవహారాన్ని కొనసాగించిన అమెరికన్ పోలీసులు, ఇమిగ్రేషన్ అధికారులు.. గత సోమ, మంగళవారాల్లో పలు చోట్ల దాడులు చేసి వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో అక్రమంగా ఉండేందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ కేసులు పెట్టారు. ఇలా అరెస్టు చేసినవారిలో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఎనిమిది మందిని మంగళవారం మిషిగన్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండేందుకు వందల మంది విదేశీ విద్యార్థులకు సాయంచేశారని చార్జిషీట్ లో ఆరోపించారు. జడ్జి ఈ ఆరోపణలపై ప్రశ్నించగా.. తమకు ఇది చట్టవిరుద్ధమని తెలియదని, తామే నేరమూ చేయలేదని నిందితులు వివరించారు. దీంతో జడ్జి విచారణను వాయిదా వేశారు. ఫణిదీప్ కర్నాటి అటార్నీ జాన్ బ్రూస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. 10 వేల డాలర్ల బాండ్ ను పూచీకత్తుగా తీసుకుని మంజూరు చేశారు. మిగతా ఏడుగురిని డిటెన్షన్ కు పంపారు. తర్వాత అటార్నీ జాన్ బ్రూస్టర్ మాట్లాడారు. ప్రభుత్వం స్టింగ్ ఆపరేషన్ చేసి విద్యార్థులకు వల వేయడం సరికాదని, ఇదంతా కావాలని చేశారని ఆరోపించారు. ఈ ఎనిమిది మందిపై నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చన్నారు.
నేరమని తెలిసే చేశారు: యూఎస్
ఈ కేసులో అరెస్టైన వారందరికీ తాము చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్టు ముందే తెలుసని అమెరికా విదేశాంగ శాఖ సోమవారంఆరోపించింది. ‘‘లెక్చరర్లు లేకుండా, క్లా సులకు వెళ్లకుండా, వర్సిటీలో చేరిన తొలి రోజు నుంచే ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉండదని వారికి తెలుసు. విదేశాల నుంచి వచ్చి చదువుకునేవారికి అమెరికా ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తుంది. ఇక్కడికి వచ్చే ఇండియా విద్యార్థుల విలువ ఏమిటో మాకు తెలుసు. ఏటా సుమారు రెండు లక్షల మంది భారతీయ స్టూడెంట్లు అమెరికాలో ఉన్నత చదువుకోసం వస్తున్నారు. వారి వల్ల ఆరు బిలియన్ డాలర్లు (సుమారు రూ.42 వేల కోట్లు) ఆదాయం వస్తోంది. వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కానీ ఇంత ఘనమైన స్టూడెంట్ ప్రోగ్రామ్ను కొందరు విద్యార్థులు, మధ్యవర్తులు దుర్వినియోగం చేయడం దారుణం. దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.”అని పేర్కొంది.
అమెరికా సర్కారు తీరు సరికాదు: నాటా
బాధితులైన విద్యార్థులకు అండగా ఉంటామని నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా ) ప్రకటించింది. అనుమతిలేని, నకిలీ యూనివర్సిటీ అని తెలియకే చాలా మంది అందులో చేరారని పేర్కొంది. విషయం బయటపడగానే చాలా మంది తెలుగు విద్యార్థులు నాటా ప్రతినిధులకు ఫోన్లు చేశారని, తాము వెంటనే అవసరమైన చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఇమిగ్రేషన్ లాయర్లు విజయ్ ఎల్లారెడ్డి, సంతోష్ సోమిరెడ్డి తదితరుల ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తున్నామని తెలిపింది. నాటా ప్రతినిధులు డిటెన్షన్ సెంటర్లకు వెళ్లి అక్కడున్న విద్యార్థులను కలిసి, ధైర్యం చెబుతున్నారని పేర్కొంది. విద్యార్థులెవరూ ఇలాంటి ట్రాప్ లో పడొద్దని, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించింది.