అల్వాల్ లో కరెంట్ షాక్తో తండ్రి, కూతురు మృతి

అల్వాల్ లో కరెంట్ షాక్తో  తండ్రి, కూతురు మృతి
  •     హైదరాబాద్​లోని అల్వాల్​లో దారుణం
  •     వర్షానికి చెట్టు కూలడంతో కారుపై తెగిపడిన విద్యుత్ తీగలు
  •     వైర్లను తీసేస్తుండగా షాక్​కు గురైన భార్య
  •     కాపాడేందుకు ప్రయత్నించి తండ్రితో పాటు కూతురు మృతి

అల్వాల్, వెలుగు:  వర్షానికి చెట్టు కూలీ కరెంటు తీగలు తెగిపడడంతో షాక్​కు గురై తండ్రి, కూతురు మృతి చెందారు. మేడ్చల్–మల్కాజ్​గిరి జిల్లా అల్వాల్​లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. అల్వాల్ ఎంఈఎస్ కాలనీకి చెందిన సందీప్(44) టెలికాం కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఆయనకు భార్య శ్వేత, ఇంటర్​ చదువుతున్న కూతురు ప్రీతిక(16) ఉన్నారు. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి సందీప్ ఇంటి ముందు ఒక చెట్టు కూలిపోయింది. చెట్టు  ప్లాస్టిక్ ఇన్సులేషన్ కలిగిన ప్రభుత్వ విద్యుత్ ​తీగలపై పడడంతో అవి తెగి అతని కారుపై పడ్డాయి. ఉదయం సందీప్​ కారు తీయబోతుంటే.. శ్వేత, ప్రీతిక కూలిన చెట్టును దూరంగా జరపడానికి ప్రయత్నించారు. 

అక్కడ వేలాడుతున్న ఒక విద్యుత్ తీగను గమనించి దానిని కారుకు దూరంగా జరపడానికి శ్వేత ప్రయత్నించారు. ఆమెకు షాక్ తగిలి కింద పడిపోయింది. గమనించిన సందీప్ ​వెంటనే దిగుతుండగా మరొక విద్యుత్ తీగ ప్రీతికపై పడింది. దీంతో ఆమె కింద పడిపోయింది. సందీప్ ఆమెను రక్షించడానికి ప్రయ త్నించగా ఆయన కూడా కరెంట్ ​షాక్​కు గురై కింద పడిపోయారు. స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి తండ్రి, కూతురును ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్వల్ప  షాక్​కు గురైన శ్వేత కొంత సేపటికి లేచారు. తండ్రి, కూతురు మృతి కరెంటు షాక్​తో ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే  ఈ ఘటనకు కారణం: మృతుడి భార్య

ఈ విషాద ఘటనకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు విద్యుత్ లైన్ల సమస్యల గురించి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నిర్వహణ చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటన విద్యుత్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.