చిత్తూరు: జిల్లాలోని పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గురూ మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పొలం వద్దనున్న గేదెల పాలు పితికేందుకు వెళ్ళాడు. పాలు పితుకుతుండగా భారీ వర్షం కురిసి, ఒక్కసారిగా పిడుగు పడటంతో రామకృష్ణతో పాటు అతని ఇద్దరు కుమార్తెలు రమాదేవి(24), మీనా(22) లు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనను పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా రామకృష్ణ భార్య ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే స్పృహ కోల్పోయింది. ఆమె ఆర్తనాదాలు గ్రామస్తులని కంటతడి పెట్టించాయి. సంఘటన స్థలాన్ని శనివారం రాత్రి గంగవరం సీఐ రామకృష్ణ చారి పరిశీలించారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.