
- సఫారీలకు చుక్కలు చూపించిన టీమిండియా
- ఫైనల్లో 1-5 తో సౌతాఫ్రికా చిత్తు
- ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ
భువనేశ్వర్: సొంతగడ్డపై ఇండియా హాకీ టీమ్ గర్జించింది. ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఆరంభం నుంచి చివరి వరకూ అదిరిపోయే ఆటతీరును కనబరిచిన టీమిండియా చాంపియన్గా నిలిచింది. ఫైనల్కు చేరి ఒలింపిక్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించిన జోష్లో ఉన్న మన్ప్రీత్సేన శనివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన టైటిల్ ఫైట్లో 5–1తో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. డ్రాగ్ఫ్లికర్స్ వరుణ్ కుమార్ (2, 49వ నిమిషాల్లో), హర్మన్ప్రీత్ సింగ్ (11, 25వ ) డబుల్ గోల్స్తో చెలరేగగా, వివేక్ ప్రసాద్ (35వ) ఒక గోల్తో జట్టుకు భారీ విజయం కట్టబెట్టారు. ప్రత్యర్థి టీమ్లో ఏకైక గోల్ రిచర్డ్ పాట్జ్ (53వ) నమోదు చేశాడు.
ఏషియన్ గేమ్స్ విన్నర్ జపాన్కు సెమీస్లో చుక్కలు చూపించిన హోమ్టీమ్.. తుదిపోరులో సఫారీలను కూడా ఓ ఆటాడుకుంది. ఐదో ర్యాంకర్గా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన మన్ప్రీత్సేన అంచనాలను తగ్గట్టు రాణించింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. ఆరంభం నుంచే సఫారీ గోల్పోస్ట్పై దాడి చేస్తూ ఆ జట్టును ఆత్మరక్షణలోకి నెట్టింది. క్రమం తప్పకుండా గోల్స్ కొడుతూ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిసిఫికేషన్ మ్యాచ్లో జపాన్ 4–2తో అమెరికాను ఓడించి మూడో స్థానం దక్కించుకుంది. ఇండియా కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు.