
- అగ్రనేతలు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంతనాలు
- కాంగ్రెస్ హెడ్క్వార్టర్స్లో దాదాపు రెండు గంటల పాటు సమావేశం
- మార్పులు కోరుకుంటున్న పలువురు మినిస్టర్లు
- మంత్రుల పనితీరుపై హైకమాండ్కు మీనాక్షి రిపోర్టు
- ఈ నేపథ్యంలో భారీగా మార్పులు ఉంటాయని ఊహాగానాలు !
- అందుకే కొత్త మంత్రులకు కేటాయింపు ఆలస్యం
- ఇయ్యాల క్లారిటీ వచ్చే చాన్స్
- ఢిల్లీకి చేరుకున్న ఉత్తమ్
- ఎస్సీ వర్గీకరణ, కులగణన సభలకు రావాలని అగ్రనేతలకు సీఎం ఆహ్వానం
న్యూఢిల్లీ, వెలుగు: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఢిల్లీలో కసరత్తు కొనసాగుతున్నది. దీనిపై వరుసగా రెండోరోజూ చర్చ జరిగింది. మంగళవారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్క్వార్టర్స్ ఇందిరా భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ముగ్గురికి శాఖల కేటాయింపుతో పాటు పాత మంత్రుల శాఖల్లో భారీగా మార్పుచేర్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటి వరకు మంత్రివర్గంలో 12 మంది ఉండగా, కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎవరెవరి దగ్గర ఏయే శాఖలు ఉన్నాయి? కొత్తగా అవకాశం కల్పించిన వారికి ఏయే శాఖలు కేటాయించాలి? అనే అంశాలపై సమావేశంలో చర్చించారు.
దాదాపు రెండు గంటల పాటు సాగిన భేటీలో సామాజిక న్యాయం ఆధారంగా మంత్రులకు శాఖలను కేటాయించాలని రాహుల్ గాంధీ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం సీఎం, మంత్రుల వద్ద ఉన్న శాఖల వివరాలను అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం తన దగ్గరున్న శాఖల జాబితాను అగ్రనేతలకు అందజేయడంతో పాటు, ఏడాదిన్నరగా ఆ శాఖల పనితీరును వారికి వివరించినట్టు తెలిసింది. అలాగే కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి ఏయే శాఖలు కేటాయిస్తే బాగుంటుందనే దానిపై సీఎం రేవంత్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట..
ప్రస్తుతం తమ వద్ద ఉన్న శాఖలను మార్చాలని పలువురు మంత్రులు ఇప్పటికే హైకమాండ్ను కోరినట్లు సమాచారం. దీనిపై సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. కాగా, మంత్రుల పనితీరుకు సంబంధించి పార్టీ స్టేట్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పటికే హైకమాండ్కు నివేదిక అందజేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పాత మంత్రుల శాఖల్లో భారీగా మార్పుచేర్పులు చేయాలనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్టు చర్చ జరుగుతున్నది. కొందరు మంత్రులు శాఖలు మార్చాలని కోరడం, మీనాక్షి రిపోర్టు ఇవ్వడం తదితర అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలో చేపట్టాల్సిన మార్పులపై భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం.
శాఖల కేటాయింపులో సీఎం నిర్ణయమే కీలకమైనందున, ఆయన అభిప్రాయానికి అధిష్టానం పెద్దపీట వేస్తున్నట్టు తెలిసింది. ఈ దిశలోనే గత రెండు రోజులుగా సీఎం దగ్గర ఉన్న ఇతర శాఖలు, పలువురు మంత్రులు దగ్గర ఒకటికి మించి ఉన్న శాఖలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఇందులో కీలకమైన శాఖలను సామాజిక న్యాయం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయంతో తమ సర్కార్ బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తూ.. సామాజిక న్యాయం అమలులో ముందు వరుసలో ఉందనే సిగ్నల్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నది. అందుకే కొత్త మంత్రుల శాఖల కేటాయింపు ఆలస్యం అవుతున్నట్టు ముఖ్య నేతలు అంటున్నారు. కాగా, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పాత మంత్రుల శాఖల్లో మార్పులపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బీజేపీ 11 ఏండ్ల పాలన వైఫల్యాలపై చర్చ..
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలతో మంగళవారం ఢిల్లీలో రాహుల్ నేతృత్వంలో విడివిడిగా సమావేశాలు జరిగాయి. ఇందిరాభవన్లో జరిగిన ఈ సమావేశాల్లో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతో వాళ్లు సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు బీజేపీ 11 ఏండ్ల పాలనా వైఫల్యాలపై చర్చ జరిగినట్టు తెలిసింది.
అలాగే తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టే రీతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించారు. కాగా, బుధవారం మరోసారి పార్టీ పెద్దలతో సీఎం భేటీ కానున్నట్టు తెలిసింది. అనంతరం సీఎం హైదరాబాద్ తిరిగి చేరుకుంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
మిగిలిన బెర్తులనూ భర్తీ చేస్తామన్న రాహుల్
మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించినోళ్లు నిరాశ పడొద్దని రాహుల్ గాంధీ సూచించినట్టు తెలిసింది. అవసరమైన టైమ్లో ఆ ఖాళీలను భర్తీ చేద్దామని సీఎంకు ఆయన చెప్పినట్టు సమాచారం. మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడినోళ్ల గురించి వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. ఇటీవల ప్రకటించిన పీసీసీ పదవులు, పెండింగ్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపైనా కూడా రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం.
కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి చేరుకోవడం, రెండ్రోజులుగా అగ్రనేతలతో సీఎం భేటీ అవుతుండడం వంటి అంశాలను పరిశీలిస్తే... మంత్రివర్గంలో మార్పులు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సీఎం వద్ద ఉన్న హోమ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లా, ఇతర కీలక శాఖలు మార్చే అవకాశం ఉందని చర్చ నడుస్తున్నది.
సభలకు ఆహ్వానం
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రెండు బహిరంగ సభలు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సభలకు హాజరుకావాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కోరగా.. ఇద్దరూ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కాగా, ఇరిగేషన్ మీటింగ్ల కోసం ఉత్తమ్ ఢిల్లీకి వచ్చినట్టు సమాచారం.