హైదరాబాద్: నాంపల్లి FSL కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఫైర్ డీజీ విక్రమ్సింగ్ మాన్ తెలిపారు. శనివారం (ఫిబ్రవరి 7) నాంపల్లి FSL కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ నారాయణతో కలిసి ఘటన స్థలాన్ని విక్రమ్ సింగ్ మాన్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆయన ఆరా తీశారు.
ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం 10.20 గంటలకు ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమాదం సంభవించినట్లు కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే అసెంబ్లీ దగ్గర ఉన్న ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చామన్నారు. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్లో ఎంసీబీ దగ్గర ఉన్న స్విచ్ బోర్డులో ఫైర్ సంభవించినట్లు అనుమానిస్తున్నామని.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని చెప్పారు.
ALSO READ : కుత్బుల్లాపూర్లో మహిళా ఫిజియో డాక్టర్ ఆత్మహత్య
ల్యాబ్లో ఉన్న కంప్యూటర్స్, హార్డ్ డిస్క్లు కాలిపోయాయని తెలిపారు. ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేస్తామన్నారు. ఎండాకాలం వస్తుండటంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని.. కాబట్టి అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉన్నామన్నారు. నగరంలోని రెసిడెన్షియల్, కమర్షియల్, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైర్ టీమ్స్ తనిఖీలు చేపడుతుందని తెలిపారు.
