టెర్రరిస్టులను చుట్టుముట్టిన సైన్యం

టెర్రరిస్టులను చుట్టుముట్టిన సైన్యం

జమ్ముకశ్మీర్ : జమ్ములోని రాంబాన్ జిల్లా బటోట్ ఏరియాలో.. ఈ ఉదయం నుంచి ఉగ్రవేట కొనసాగుతోంది. బటోట్ పట్టణంలో ఆర్మీ, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. కొంతమంది ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. సాయుధ బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగాయి. టెర్రరిస్టులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో.. సైన్యం వారిని వెంటాడింది. ఉగ్రవాదులు పారిపోతూ.. అక్కడే ఉన్న ఓ ఇంట్లోకి దూరి… అందులోని కుటుంబసభ్యుల్లో ఒకరిని తమ దగ్గర బందీగా పెట్టుకుని… మిగతావారిని బయటకు పంపించారు.

ఆ భవనం చుట్టుపక్కల మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారని కశ్మీర్ పోలీసులు చెప్పారు. ఆ భవనాన్ని సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయని పోలీసులు చెప్పారు. బందీగా ఉన్న వ్యక్తిని కాపాడి… ఉగ్రవాదులను ఆట కట్టించేందుకు  సైన్యం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.